Ex IPS ABV Slams : మాజీ సీఎం జగన్ పై భగ్గుమన్న మాజీ ఐపీఎస్ ఏవిబి

ఒక్క వడ్డెర కులస్తుడు జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు...

Ex IPS ABV : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డిపై దాడి కేసును ఎదుర్కుంటున్న బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈరోజు (మంగళవారం) గులకారయి కేసులో నిందితులు సతీష్ ఇంటికి ఏబీ వెళ్లారు. సతీష్ తల్లిదండ్రులు, పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఏబీ వెంకటేశ్వరరావు(Ex IPS ABV) మాట్లాడుతూ.. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్(YS Jagan) అంటూ మండిపడ్డారు. లేనిపోని దాన్ని తీసుకుని మభ్యపెట్టి రాజకీయం చేశారని విమర్శించారు. ఒక్క వడ్డెర కులస్తుడు జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ex IPS ABV Slams YS Jagan

గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను అప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఫైర్ అయ్యారు. బలహీనుడు కాబట్టి సతీష్‌ను బలి చేశారు, 45 రోజులు సతీష్‌ను జైలులో పెట్టారన్నారు. ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికీ తిప్పుతున్నారని అన్నారు. ఈరోజు వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదన్నారు. వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వింటే గుండె తరుక్కుపోతోందన్నారు. 2 లక్షలు డబ్బులు ఇస్తామని మభ్యపెట్టారని.. కానీ నేటికి అన్నం తినలేని పరిస్థితిలో బాధితులు ఉన్నారని తెలిపారు. ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని, సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

బాధితులు చేసిన తప్పు ఏంటి , ఏ మాత్రం సంబంధం, సాక్ష్యం లేని కేసులో ఎందుకు వాళ్ళు బాధపడాలని అడిగారు. జగన్ ఆకృత్యాలకు ఇది ఒక ఉదాహరణ అని.. ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు. కేసు తక్షణమే మూసేయాలని, బెయిల్ బాండ్స్ రద్దు చేసి, వారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని… అంతేకాకుండా ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

కాగా.. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో సింగ్‌నగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా గులకరాయు వచ్చి తగిలింది అంటూ హడావుడి జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు జగన్ నుదిటిపై పట్టి వేసుకుని తిరిగారు. ఈ కేసులు వేముల సతీష్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్‌పై సతీష్ విడుదలయ్యారు.

Also Read : MP Kanimozhi : భారతదేశ అధికార భాషపై వచ్చిన ప్రశ్నకు స్మార్టుగా సమాధానం ఇచ్చిన ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!