Ex Minister Prasanth Reddy : ఎమ్మెల్యేల అనర్హత వేటుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

కాగా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది...

Ex Minister : ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు, సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి(Ex Minister Prasanth Reddy) అన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన సోమవారం, హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సభాపతి ఇంకా జాప్యం చేయలేరని, స్పీకర్ కూడా గతంలో పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని, వాటిని ప్రోత్సహించబోనని అన్నారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. మణిపూర్, మహారాష్ట్ర రాష్ట్రాలలో కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై వంద రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అనర్హత వేటు వేశారన్నారు. రేవంత్ రెడ్డి ఇంటింటికీ తిరిగి పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు ఇక అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని ఆయన అన్నారు. సభాపతి హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రశాంత్ రెడ్డి కోరారు.

Ex Minister Prasanth Reddy

కాగా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్‌ పార్టీపై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఇదిలాఉంటే.. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌‌తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read : CM Revanth Reddy : ఐఐహెచ్‌టీని ప్రారంభించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!