Yogandhra 2025 : విజయవాడ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రైతన్నలు
చిన్న చిన్న టెక్నిక్ ద్వారా యోగాను పాటిస్తే మంచి ఆరోగ్యం సంపాదించవచ్చన్నారు...
Yogandhra 2025 : యోగాంధ్రాలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాసోత్సవం జరుగుతోంది. ఈరోజు (శనివారం) నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో కలెక్టర్ లక్ష్మీ శా ఆధ్వర్యంలో యోగాంధ్ర(Yogandhra 2025) కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, కలెక్టర్ లక్ష్మీ శా, మున్సిపల్ కమీషనర్ ధ్యాన్ చంద్ యోగాసనాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులు యోగాంధ్రలో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. ఈరోజు రైతులతో కలిసి యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిరోజూ యోగాసనాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకువస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న టెక్నిక్ ద్వారా యోగాను పాటిస్తే మంచి ఆరోగ్యం సంపాదించవచ్చన్నారు.
Yogandhra 2025 in Vijayawada
కామన్ యోగాసనాలతో అనేక రుగ్మతలను దూరం పెట్టవచ్చని చెప్పుకొచ్చారు. నేడు బిజీ లైఫ్లో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని.. బీపీ, షుగర్లు, ఇతర జబ్బులు పెరుగుతున్నాయన్నారు. యోగాసనాల ద్వారా వీటిని శరీరంలోకి రాకుండా చేయవచ్చని తెలిపారు. ప్రణాయామం, ధ్యానం యోగాలో చాలా ముఖ్యమన్నారు. మనం చేసే పనిపై ధ్యాస పెట్టి చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయని అన్నారు. మన మైండ్కు ఇవ్వాల్సిన రిలాక్సేషన్ ఇప్పుడు ఇవ్వడం లేదని.. అటువంటి ఒత్తిడిని తట్టుకోవాలంటే యోగా, ధ్యానం, నడక అవసరమని వెల్లడించారు. 2015 తరువాత ప్రపంచ యోగా డేగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారన్నారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ బీఆర్టీఎస్ రోడ్ను యోగా రోడ్గా మార్చడం శుభపరిణామమని ఢిల్లీ రావు అన్నారు.
యోగాంధ్రలో భాగంగా మాసోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని కలెక్టర్ లక్ష్మీ శా అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పది లక్షల మంది, రాష్ట్రం మొత్తం మీద రెండు కోట్ల మంది యోగాలో భాగస్వామ్యం చేయడం ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటారన్నారు. బీఆర్టీఎస్ రోడ్ను నిత్య యోగా రోడ్గా మార్చామన్నారు. ఇక నుంచి విజయవాడ(Vijayawada) వాసులు ప్రతి రోజూ ఈ రోడ్లో యోగాసనాలు వేసుకోవచ్చన్నారు. ప్రతిరోజూ 45 నిమిషాల పాటు చేసే యోగా… ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుందని కలెక్టర్ లక్ష్మీ శా పేర్కొన్నారు.
Also Read : Telangana Govt : ఇకపై రేషన్ షాపుల్లో 3 నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ