Ganta Srinivasa Rao Slams : మాజీ సీఎం జగన్, వెన్నుపోటు, కత్తి పోటుకు బ్రాండ్ అంబాసిడర్
వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు కృత నిశ్చయంతో తీర్పునిచ్చారని తెలిపారు...
Ganta Srinivasa Rao : ఏడాది క్రితం ఇదే రోజు ఎన్నికల ఫలితాలు విడుదలై కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో అధికార పక్షం సంబరాలు చేసుకుంటోంది. అయితే ప్రతిపక్షం మాత్రం వెన్నుపోటు దినం అంటూ కార్యక్రమాలు చేస్తోంది. దీంతో వైసీపీ తీరుపట్ల కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) మాట్లాడుతూ.. కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్తో సీట్లు గెలిచిందన్నారు. కేవలం 6 శాతం సీట్లు గెలిచిన వారు ప్రతిపక్షం కావాలంటే ఇవ్వరని తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధంగా సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని వెల్లడించారు. వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు కృత నిశ్చయంతో తీర్పునిచ్చారని తెలిపారు.
Ganta Srinivasa Rao Slams YS Jagan
ఊరందరిదీ ఒక దారి ఉలికి పిట్టది ఒకదారి అన్నట్లుంది జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) వ్యవహారం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుని అపహస్యం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ వెన్నుపోటు దినమంటూ హడావుడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును చూసి జగన్కు మైండ్ బ్లాక్ అయి ఉంటుందన్నారు. వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినం చేస్తున్నావా జగన్ అంటూ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి .. ఏదైనా చేయాలంటే ఐదేళ్ల సమయం ఉందనేవాడని గుర్తు చేశారు. కానీ కూటమి ఇచ్చిన హామీల్లో 80 శాతం దాదాపుగా పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.
‘వైసీపీ మేనిఫెస్టో, కూటమి మానిఫెస్టోపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. మేం సవాల్ విసురుతున్నాం ఎక్కడైనా చర్చిద్దాం.. అమలు చేయలేదంటే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. మాజీ సీఎం మైండ్ బాగుపడి… సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నాను అంటూ సెటైర్ విసిరారు. రాజకీయాలను పాతాళానికి తొక్కిన వ్యక్తి జగన్ అని.. తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని ఏం చేశాడో అందరూ చూశారన్నారు. ఆయనకు విలువల గురించి మాట్లాడే హక్కు లేదని గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఎన్డీఏ కూటమి సుపరిపాలన మొదలై సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా పెందుర్తి మండలం పెద్దగాడి గ్రామంలో సంక్రాంతిని తలపించే విధంగా సంబరాలు నిర్వహించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కూటమి నాయకులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ మాట్లాడుతూ.. నరకాసురు లాంటి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తమకు వద్దు అని ఈ కూటమికి 164 సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఈ సంవత్సర కాలంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల మన్ననలు పొందామన్నారు. కేంద్ర ప్రభుత్వం మోదీ సహకారంతో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఈరోజు వైసీపీ వారు వెన్నుపోటుదినం చేయడం దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందంటూ ఎద్దేవా చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు జగన్ అంటూ పంచకర్ల రమేష్ బాబు విమర్శలు గుప్పించారు.
Also Read : TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్