Guntur Police: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
Guntur Police : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి… అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని గుంటూరు పోలీసులు(Guntur Police) అరెస్ట్ చేసారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి… దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ను అరెస్టు చేసారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు.
Guntur Police Arrest
ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ… మార్క్ శంకర్(Mark Shankar) లక్ష్యంగా పెట్టిన పోస్ట్ లపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి… దర్యాప్తు ప్రారంభించామన్నారు. దీనిలో భాగంగా ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి… కర్నూలు జిల్లాకు చెందిన పొట్టపాశం రఘు అలియాస్ పుష్పరాజ్గా గుర్తించామని చెప్పారు. నిందితుడు రఘు 5 మొబైల్స్ను వినియోగించారు. 14 మెయిల్ ఐడీలను వాడి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఖాతాలు తెరిచారు. రఘు చేసిన పోస్టులన్నింటినీ పరిశీలించాం. ఎక్కువగా మహిళలను కించపరిచేలా ఉన్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు గాను రఘుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాం. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్లో భాగంగా అతడు ఈ పోస్ట్ చేశారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు అలియాస్ పుష్పరాజ్ ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు. గతంలో మహిళలపై సైతం ఇతడు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టాడని గుర్తు చేశారు.
సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం తెలియగానే… పవన్ కళ్యాణ్తోపాటు ఆయన సోదరుడు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుట పడిన తరువాత హైదరాబాద్ కు తీసుకువచ్చారు. మరోవైపు కుమారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడడంతో… మార్క్ శంకర్ తల్లి అన్నా లెజినోవా… తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించుకొన్నారు. అలాగే వెంగమాంబ సన్నిధిలో ఒక పూట భోజనానికి విరాళం సైతం అందజేశారు. అలాంటి వేళ.. మార్క్ శంకర్ గాయపడడంతో… అతడినే లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు … కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Also Read : OG Kush Drugs: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఓజీ కుష్ డ్రగ్స్