IND vs ENG 1st ODI : చెలరేగిన ఇండియా చేతులెత్తేసిన ఇంగ్లండ్
10 వికెట్ల తేడాతో ఘన విజయం
IND vs ENG 1st ODI : భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ప్రధానంగా స్టార్ పేసర్ గా పేరొందిన జస్ ప్రీత్ బుమ్రా దెబ్బకు తొలి వన్డే
మ్యాచ్ లో ఇంగ్లండ్ కేవలం 110 పరుగులకే చాప చుట్టేసింది.
అనంతరం బరిలోకి దిగిన భారత్ సునాయసంగా వికెట్ నష్ట పోకుండా ఛేదించింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. బుమ్రా ఏకంగా ఆరు
వికెట్లు పడగొట్టడం విశేషం.
జేసన్ రాయ్ ని జస్ప్రీత్ నాలుగో బాల్ కే పంపించాడు. మరో రెండు బంతులకే జో రూట్ ను కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టాడు. టెస్టు మ్యాచ్ లో
దుమ్ము రేపి భారత్ కు చుక్కలు చూపించిన జానీ బెయిర్ స్టోకు తన అద్భుతమైన బంతితో షాక్ ఇచ్చాడు బుమ్రా.
కుదురుకుంటాడని అనుకుంటున్న లివింగ్ స్టోన్ ను సూపర్ బాల్ కు క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్ హిట్టర్ బెన్ స్టోక్స్ ను మహ్మద్ షమీ సాగనంపితే
ఆదుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్న జాస్ బట్లర్ కు షాక్ ఇచ్చాడు ప్రసిద్ద్ కృష్ణ.
టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్కిప్పర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు భారత బౌలర్లు. స్వింగ్ తో చెలరేగారు భారత బౌలర్లు(IND vs ENG 1st ODI).
పరుగుల సంగతి పక్కన పెడితే ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు డిఫెన్స్ ఆడేందుకు నానా తంటాలు పడ్డారు. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా
సూపర్ ఇన్నింగ్స్ తో విక్టరీ సాధించింది.
బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. 6 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. విచిత్రం ఏమిటంటే నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విస్తు
పోయేలా చేసింది. జస్ ప్రీత్ బుమ్రా 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు.
ఇక భారత్ 18.4 ఓవర్లలో 114 రన్స్ చేసింది. రోహిత్ శర్మ 76 నాటౌట్ కాగా శిఖర్ ధావన్ 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : జస్ ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల