KTR : నూతన వైఖరిపై సర్కారు వైఖరి చెప్పాలంటూ లేఖ రాసిన కేటీఆర్

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందన్నారు...

KTR : దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కేటీఆర్(KTR) బహిరంగ లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయన్నారు.

KTR Comment

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా.. లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలన్నారు.

ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలన్నారు. దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరపున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Also Read : Delhi Liquor Scam : మరోసారి వాయిదా పడ్డ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ

Leave A Reply

Your Email Id will not be published!