Raj Pakala : పోలీసు నోటీసులపై స్పందించిన కేటీఆర్ బావమరిది

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు...

Raj Pakala : జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ బావమరది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మోకిలా పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఎట్టకేలకు కేటీఆర్(KTR) బావమరది స్పందించారు. మోకిలా పోలీస్ స్టేషన్‌కు రాజ్ పాకాల న్యాయవాదులు చేరుకున్నారు. విచారణకు వచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని పాకాల న్యాయవాదు పోలీసులను కోరారు.

Raj Pakala Comment

కాగా.. విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్(KTR) బావమరిదికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. బిఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూఫ్‌లతో పాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈరోజు మోకిలా పీఎస్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని పేర్కొంటూ రాజ్ పాకాలకు మోకిలా ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీచేశారు. అయితే రాజ్ పాక్‌లా అందుబాటులో లేకపోవడంతో ఆయన ఉంటున్న విల్లాకు నోటీసులను అంటించారు పోలీసులు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. జన్వాడలోని రాజ్‌ పాకాల ఫాంహస్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విదేశీ మద్యంతో పాటు క్యాసినో ఆట వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో అనుమతి లేకుండా వినియోగిస్తున్న విదేశీ మద్యం 7.6 లీటర్లు, ఐఎంఎఫ్ఎల్‌ మద్యం 8.1 లీటర్లు, బీర్లు 6 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ అక్కడే డ్రగ్‌ టెస్టులు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు నిరాకరించారు. అయితే పురుషులందరికీ డ్రగ్‌ టెస్టులు నిర్వహించగా విజయ్‌ మద్దూరికి పాజిటివ్‌ వచ్చింది. అయితే నిన్న పార్టీలో హాజరైన మహిళలు.. మోకిలా పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. ఫాంహౌస్‌లో దాడి సందర్భంగా పలువురి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. దీంతో సీజ్ చేసిన తమ ఫోన్స్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్‌కు మహిళలు వస్తున్నారు. ‘‘ మా వ్యక్తిగత సమాచారం ఇచ్చామని.. మా ఫోన్స్ ఇవ్వాలి’’ అని పోలీసులను మహిళలు కోరుతున్నారు.

Also Read : Iran President : ఇజ్రాయెల్ పై హెచ్చరికలు జారీచేసిన ఇరాన్ అధినేత ఎక్స్ పై వేటు

Leave A Reply

Your Email Id will not be published!