Manda Krishna Madiga : మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, చంద్రబాబు....
Manda Krishna Madiga : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని.. ఈ అవార్డు ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ పురస్కారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు, ఉద్యమానికి దక్కిన గౌరవమని, జాతికి అండగా ఉన్న సమాజానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని అన్నారు. లక్ష్యం కోసం పనిచేస్తే గుర్తింపు, గౌరవం వస్తుందనడానికి తనకు వచ్చిన పురస్కారమే నిదర్శనమని మంద కృష్ణ అన్నారు.
Manda Krishna Madiga got Padma Shri Award
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, చంద్రబాబు.. వర్గీకరణ లక్ష్యానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంద కృష్ణ అన్నారు. పద్మశ్రీ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, సమాజానికి రుణపడి ఉన్నామని, ఎమ్మార్పీఎస్ లక్ష్యం వర్గీకరణ అయినప్పటికీ సమాజం కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా స్వతంత్య్రం అనంతరం అపరిష్కృతంగా ఉన్న అంశాలపై దృష్టి పెడతామన్నారు. ప్రజా ఆకాంక్షలకు అణుగుణంగా ముందుకు వెళతామని, మేధావులు, సంఘాలు, రాజకీయ వర్గాలతో చర్చించి భవిష్యత్ అజెండా రూపొందించుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. దేశంలో పెండింగ్ సమస్యలపై పోరాడతామని, ఆర్ఎస్ఎస్ నుంచి ఎర్రజెండా మేధావుల వరకు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడైన మందకృష్ణ మాదిగ తన అవిశ్రాంత పోరాటంతో ఎస్సీ ఉపవర్గీకరణను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆమోదించడంలో కీలకపాత్ర పోషించారని అవార్డుతోపాటు అందజేసిన ప్రశంసాపత్రంలో రాష్ట్రపతి భవన్ పేర్కొంది.
Also Read : Kamal Haasan-Rajya Sabha : డీఎంకే పార్టీ నుంచి రాజ్యసభకు అగ్రనటుడు ‘కమల్ హాసన్’