Minister Bandi Sanjay : ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారు..
Bandi Sanjay : మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు .. నీచుడు, అతను మామూలోడు కాదు, ఎంతో మంది ఉసురుపోసుకున్నాడు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయి సిట్ విచారణకు హాజరయ్యాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని బండి వ్యాఖ్యానించారు. మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్న వ్యక్తి ప్రభాకర రావు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Union Minister Bandi Sanjay Slams
సిట్ విచారణలో SIB(Special Intelligence Bureau) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఇచ్చిన స్టేట్మెంట్ను బహిరంగ పర్చాలని బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు…నాతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ట్యాప్ చేసిన ఘనడు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమైనయ్. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయ్. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు.. ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారు’. అని బండి సంజయ్ చెప్పారు.
ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్న బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు.. ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? అన్నవి బహిర్గతం కావాలని బండి సంజయ్ అన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని..18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో కూడా విచారణ ముందుకు సాగలేదని బండి విమర్శించారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు విన్పించాలని, ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
ఇలా ఉండగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్కు అండగా ఉన్నారంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లి చాలా కాలం అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్రావు ఆదేశాల మేరకే తాను సమాచారాన్ని ధ్వంసం చేశానని ప్రణీత్రావు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, 2018 నుంచే తెలంగాణలో అక్రమ ట్యాపింగ్ దందా మొదలైనట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు బంధువే ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని కూడా విమర్శలు వచ్చాయి.
Also Read : Shining Star Awards : ఏపీలో విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్ అవార్డులు’