ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

స్ప‌ష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

వ‌రంగ‌ల్ జిల్లా : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంద‌ని అన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించుకుందాం అని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాల‌ని అన్నారు.
మహబూబాబాద్ ఐడీఓసీలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో సహచర మంత్రి కొండా సురేఖ , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొని దిశానిర్దశం చేశారు మంత్రి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు.

ప్రజలకు మంచి చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపనను, సాకారం చేసే బాధ్యత అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు అందరిపై ఉందన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు పరచడంలో ప్రతి అధికారి పూర్తి అంకిత భావంతో తమ పరిధిలోని పనులు చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలిచేలా తయారు కావాలన్నారు. అందుకు ప్రభుత్వం తరపున కావాల్సిన మద్ధతు తప్పకుండా అందుతుందని అన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవనాల స్థానంలో నూతనంగా నిర్మించడం లేదా ప్రత్యామ్నాయ చర్యలను అధికారులు పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు. బాలికల పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు, ఇన్సులేటర్స్ మొదటి ప్రాధన్యత కింద ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. అధికారులు విద్యార్థుల సంక్షేమ హాస్టళ్ల బాధ్యతను భుజాన వేసుకోవాలని అన్నారు. వారంలో కనీసం ఒక్కరోజు హాస్టల్లో బస చేసి, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని స్ప‌ష్టం చేశారు. ఈ శాఖలలో ఎదురవుతున్న సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో అధికారులు ప్రణాళికా బద్ధంగా పని చేయాల‌న్నారు. మార్చి నెలాఖరు వరకు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలన్నారు. అనర్హులకు ఇండ్లు ఇస్తే కలెక్టర్లు భాద్యులు అవుతారని హెచ్చ‌రించారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. అదే విధంగా గిరిజనులు తమ పాకల స్థానంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను కట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు కలిసికట్టుగా సర్వే చేసి. భూముల సరిహద్దులను నిర్ణయించు కోవాల‌న్నారు.
అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్ట వ‌ద్ద‌ని సూచించారు,
రెవెన్యూ శాఖకు సంబంధించిన పాస్ బుక్కులు, సాదా బైనామాలు, ఇతర ఏ పనులు కూడా పెండింగ్ ఉండడానికి వీలు లేదని అన్నారు. సహజ వ్యవసాయాన్నీ ప్రోత్సహించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!