Miss World: మిస్‌ వరల్డ్‌ 2025కు ఇచ్చే బహుమతి ఎంటో తెలుసా ?

మిస్‌ వరల్డ్‌ 2025కు ఇచ్చే బహుమతి ఎంటో తెలుసా ?

Miss World : హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిస్‌ వరల్డ్‌(Miss World) 2025 పోటీల్లో మిస్‌ థాయ్‌లాండ్‌ ఓపల్‌ సుచాత ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనితో ఈ పోటీల్లో ఆమె గెలుచుకున్న ప్రైజ్ మనీపై అందరికీ ఆశక్తి నెలకొంది. అయితే ఈ పోటీల్లో గెలుపొందిన విశ్వ సుందరి తక్షణమే రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ, వజ్రాలు పొదిగిన కిరీటం సొంతం చేసుకుంది. వీటికంటే ఎంతో విలువైన అంతర్జాతీయ ఖ్యాతి, గుర్తింపు లభించనున్నాయి. రానున్న ఏడాది కాలంపాటు దేశదేశాల్లో అందరినోటా ఆమె పేరే వినిపించనుంది. పేరుమోసిన బ్రాండ్‌లకు అంబాసిడర్‌ గా, మోడల్‌ గా, నటిగా, సామాజిక సేవా కార్యకర్తగా అనేక అవకాశాలు ఆమె తలుపు తడతాయి.

మిస్‌ వరల్డ్‌ సంస్థ తరఫున ‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా ఆమెకు లగ్జరీ లైఫ్‌తోపాటు ప్రొఫెషనల్‌ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు అందుబాటులో ఉంటారు. ఖరీదైన మేకప్‌ కిట్లు, దుస్తులు, నగలు లాంటివన్నీ ఉచితంగా లభిస్తాయి. ఎక్కడికెళ్లినా పటిష్ఠ భద్రత ఉంటుంది.

Miss World – రూ.85 లక్షల విలువైన ధగధగల కిరీటం

విలువైన వజ్రాలతోపాటు ఎన్నెన్నో ప్రత్యేకతలు పొదిగిన కిరీటాన్ని మిస్‌ థాయిలాండ్‌ అందుకున్నారు. కిరీటంలోని ప్రతి అణువూ ప్రపంచ సుందరి పోటీల ప్రాముఖ్యాన్ని, మహిళా శక్తిని ప్రతిబింబిస్తుంది. మిస్‌ వరల్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ప్రస్తుత కిరీటం విలువ సుమారు లక్ష అమెరికన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ.85.56 లక్షలు.

ఇది నాలుగో కిరీటం

మిస్‌ వరల్డ్‌ కిరీటాలను జపాన్‌ కి చెందిన ‘మికిమోటో’ అనే నగల కంపెనీ రూపొందిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న కిరీటాన్ని 2017లో రూపొందించారు. ఈ పోటీల చరిత్రలో ఇది నాలుగోది. 1951 నుంచి 1973 వరకు ఉపయోగించిన కిరీటం ముత్యాలు, వజ్రాలతో సాధారణంగా ఉండేది. 1974 నుంచి 2000 వరకున్న రెండోది కాస్త ముదురు ఎరుపు రంగులో ఒక శిలువలా ఉండేది. 2001 నుంచి 2016 వరకు ఉపయోగించిన మూడో కిరీటాన్ని మధ్యలో ఆకర్షణీయమైన మణి, చుట్టూ మహాసముద్రాలను సూచించే రెమ్మలతో కూడిన వెండి, బంగారంతో రూపొందించారు. ప్రస్తుత కిరీటం చుట్టూ ఏడు ఖండాలను ప్రతిబింబించేలా బంగారు రెమ్మలు ఉన్నాయి. వాటిని ముత్యాలు, వజ్రాలతో అలంకరించారు.

కిరీటం విజేత సొంతమా ?

ఈ కిరీటం ఎప్పటికీ విజేత సొంతం కాదు. వచ్చే ఏడాది పోటీల్లో విజయం సాధించే యువతికి ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ స్వయంగా అలంకరించాలి. అయితే, కిరీటం ప్రతిరూపాన్ని ఆమెకు అందజేస్తారు.

Also Read : Miss World 2025: ప్రపంచ సుందరిగా థాయ్ లాండ్ సుందరి ‘సుచాత’

Leave A Reply

Your Email Id will not be published!