MLA Gadde Rammohan : రేషన్ పంపిణీపై టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ...
Gadde Rammohan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ ఓ పండుగలా ప్రారంభమైందని, ప్రజలు పదిహేను రోజుల పాటు తమకు నచ్చిన సమయాల్లో సరుకులు తీసుకోవచ్చునని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎమ్మెల్యే పటమట జెడీ నగర్లో ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఓ దివ్యాంగురాలి ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా బియ్యం, పంచదార అందచేశారు. గద్దె రామ్మోహన్ వెంట కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, ఎయస్వో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
MLA Gadde Rammohan Comments
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(Gadde Rammohan) మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వాహనాలను బియ్యం స్మగ్లింగ్ కోసం వాడుకున్నారని విమర్శించారు. వారు వెళ్లిన సమయాల్లో లబ్దిదారులు లేరని బియ్యం ఇవ్వకుండా వదిలేశారని, బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. యధా రాజా తధా ప్రజా అన్న విధంగా జగన్తో పాటు అ పార్టీ నేతలు అవినీతికి తెగబడ్డారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఇబ్బందులు గుర్తించి.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయిలో సమీక్ష చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని అధ్యయనం చేశారని, ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఎండియీ వ్యవస్థను రద్దు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(Gadde Rammohan) చెప్పారు. రేషన్ షాపుల ద్వారా ఇక ప్రతి రోజూ సరుకులు తీసుకోవచ్చునని, ఇది చాలా సౌకర్యంగా ఉందని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు రేషన్ డీలర్లే వెళ్లి సరుకులు అందించే ఏర్పాటు చేశారని చెప్పారు. మొదటి మూడు రోజుల్లోనే వారికి పంపిణీ చేయాలని ఆదేశాలు వెళ్లాయన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పంచడమే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని గద్దె రామ్మోహన్(Gadde Rammohan) పేర్కొన్నారు.
కాగా ఏపీలో రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. వాహనాల ద్వారా పంపిణీని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం…. ఈ రోజు నుంచి రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో మండల కేంద్రాల నుంచి స్టాక్ను రేషన్ షాపులకు తరలించారు. ఆదివారాల్లో కూడా సరుకులు పంపిణీ చేయబడతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇది వరకే ప్రకటించారు. నెలకు మొదటి 15 రోజులు ఉదయం, సాయంత్రం వేళల్లో సరుకులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తారు. వీలైన సమయంలో లబ్దిదారులు వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చు.
Also Read : Nigeria Road Accident : నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం..21 మంది యువ అథ్లెట్ల మృతి