MLA Harish Rao : కాళేశ్వరంపై మంత్రి అబద్దపు ప్రచారం చేస్తున్నారు

ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని.....

Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌‌కి జ్ఞానం ఉందో లేదో తెలియదని విమర్శించారు. కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన రంగనాయక సాగర్ నుంచి ఇక్కడ పొలాలకు నీళ్లు వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం) సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని గంగమ్మ దేవాలయ అమ్మవారి వార్షికోత్సవంలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.

MLA Harish Rao Shocking Comments

ఈ ప్రాజెక్ట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చెప్పారని… మరి రాఘవాపూర్ చెరువులో నీళ్లు ఎక్కడివని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌తో ఉపయోగం లేదని అన్నోళ్లకి ఈ ఏడాది పండిన పంట తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు పారుతున్నాయని తెలిపారు. గతంలో అన్నదాతలు ఒకరిని చూసి మరొకరు మిత్తికి పైసలు తెచ్చి పంటలు సాగు చేసేవారని చెప్పుకొచ్చారు. రేవంత్ ప్రభుత్వ తప్పిదాలతో రైతులు ఏడాదంతా ఇబ్బంది పడుతున్నారని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

‘మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకుని, కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానం చేసుకున్నాం. కాలమైనా, కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు పండించుకుంటున్నాం. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్‌లో కూర్చుని ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ బతుకుదెరువు చూపించారు. రేవంత్ ప్రభుత్వం బతుకుదెరువును ఆగం చేసింది. ఈ రోజు కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ రావాలని, మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా అని హరీష్‌రావు ప్రశ్నించారు.

Also Read : CM Revanth Reddy : గో సంరక్షణ పై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!