Red Book: రెడ్ బుక్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ !
రెడ్ బుక్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ !
Red Book: రెడ్ బుక్ పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని పీవీకి భారతరత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే… విజయసాయిరెడ్డి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తు చేశారు. రెడ్ బుక్ విషయంలో మాత్రం జాతీయ మీడియాను బతిమాలి పిలిపించుకుని ప్రచారం కల్పించారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రెండు ప్రెస్మీట్లు పెట్టిన జగన్… 11 సీట్లు వచ్చిన నెలలోపే ఐదు ప్రెస్మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అసత్యాలకు… అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెబుతామన్నారు. జగన్(YS Jagan) అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామని తెలిపారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరని… జగన్ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచరని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Red Book…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిసాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం నాడు లోకేష్ ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.అనంతరం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని తానే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పానన్నారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
కాగా.. ‘‘ఏపీలో హింసాకాండ’’ అంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan) ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించాలంటూ పార్టీ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో హింసాకాండ చెలరేగిపోతోందని… తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో లోకేశ్ రెడ్ బుక్ పాలన సాగుతోందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ దుయ్యబట్టారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో జగన్ పదేపదే లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
Also Read : Prof Kodandaram: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరాం ఫైర్ !