Pawan Kalyan-Udhayanidhi : సనాతన దర్మం కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న వార్

సనాతన ధర్మాన్ని కొందరు వైరస్‌తో పోలుస్తున్నారని, ఇది ఎంతమాత్రం సహేతుకం కాదన్నారు...

Pawan Kalyan : సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తిరుపతి వారాహి సభతో పవన్ కళ్యాణ్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఎవరిపై ప్రత్యక్షంగా ఆరోపణలు, విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపై తనదైన స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్‌(Udhayanidhi)పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్‌తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్(Udhayanidhi) వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ స్పందిస్తూ.. వెయిట్ అండ్ సీ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.

Pawan Kalyan Comment

సనాతన ధర్మాన్ని కొందరు వైరస్‌తో పోలుస్తున్నారని, ఇది ఎంతమాత్రం సహేతుకం కాదన్నారు. సనాతన ధర్మం ఇతర మతాలు, ధర్మాలను ధ్వేషించదన్నారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తే వారే తుడిచిపెట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా సనాతన ధర్మంపై విమర్శలు మానాలని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సనాతన ధర్మాన్ని నాశనం చేయలేరని, అలా చేస్తే మీరే తుడిచిపెట్టుకుపోతారని.. తిరుపతి బాలాజీ పాదాల చెంత నుంచి చెబుతున్నా అంటూ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని, చట్టాన్ని అమలు చేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి, దాని విశ్వాసాలకు హాని కలిగించే చర్యలను నివారించడానికి బలమైన చట్టం అవసరమిన, తక్షణమే ఈ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏడాది ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తన ప్రసంగంలో డీఎంకే పార్టీ పేరును, ఆ పార్టీ నాయకుల పేర్లను ప్రస్తావించనప్పటికీ.. ఆ పార్టీ నేతలు పవన్ వ్యాఖ్యలపై స్పందించారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో పాటు ఎన్డీయే కూటమిపై డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే క్లీన్‌స్వీప్ చేసిందన్నారు. బీజేపీ ఒక్కసీటును గెలుచుకోలేదని తెలిపారు. తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పక్కనే ఉన్న తమిళనాడులోని డీఎంకే నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్న నేపథ్యంలో జనసేన నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : S Jaishankar : ఇస్లామాబాద్ షాంగై సమావేశానికి భారత విదేశాంగ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!