PM Narendra Modi: ‘జీ 7’ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
‘జీ 7’ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకు జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి… ఈ సదస్సుకు ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఆహ్వానించడం గమనార్హం.
PM Narendra Modi gets Invitation
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.
‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్లో జరిగే జీ7 సమ్మిట్కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండియా-కెనడా గౌరవించుకుంటూ, పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయని మోదీ చెప్పారు. జీ7 సదస్సులో మార్క్ కార్నీతో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
Also Read : Bengaluru Stampede: 100 కోట్ల ఆస్తి ఉన్న బీటెక్ విద్యార్థి బెంగుళూరు తొక్కిసలాటలో మృతి