Raghurama Krishna Raju : గంజాయి బ్యాచ్ కు మాజీ సీఎం మద్దతివ్వడం బాధాకరం
హెల్త్ కార్డ్ కోసం కొంతమంది నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మరి తెల్లరేషన్ కార్డు తీసుకుంటున్నారని....
Raghurama Krishna Raju : గంజాయి బ్యాచ్కు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి పలకడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. అరాచకాలు చేసినవారికి జగన్(YS Jagan) మద్దతివ్వడం దారుణమని చెప్పారు. డాక్టర్ సుధాకర్ను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తనకు ఓటేయని ప్రజలపై వైసీపీ వెన్నుపోటు దినోత్సవం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) అమరావతిలో రఘురామ పర్యటించారు. హెల్త్ కార్డ్ కోసం కొంతమంది నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మరి తెల్లరేషన్ కార్డు తీసుకుంటున్నారని.. అలా చేయొద్దని రఘురామకృష్ణంరాజు కోరారు.
Raghurama Krishna Raju Slams YS Jagan
హెల్త్ కార్డ్ ఉన్న ప్రతి పౌరుడికి రూ. 25 లక్షలు కవరయ్యేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ముందు తమ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీ స్పీకర్కు ఇస్తామని వెల్లడించారు. అవసరం లేకుండా కొంతమంది రేషన్ తీసుకోవడం వల్లే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని అన్నారు. ఇప్పుడు కోటి 40 లక్షలు మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు. ఏపీలో మొత్తం కోటి 70 లక్షల కుటుంబాల్లో.. కోటి 40 లక్షలు బీపీఎల్ కిందే ఉన్నారనే విషయాన్ని నమ్మడం కష్టమని అన్నారు. రేషన్ అవసరం లేని వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి హెల్త్కార్డ్లో భాగంగా రూ. 25 లక్షలు కవరయ్యేలా చేస్తామని వివరించారు రఘురామకృష్ణంరాజు.
ఏపీ ప్రభుత్వం రేషన్కు రూ.5, 100 కోట్లు ఇస్తోందని.. ఇందులో రూ. 2000 కోట్లు రేషన్లో మిగిలితే ఆ మొత్తం విద్యాశాఖకు ఖర్చు పెడితే నాణ్యమైన విద్యా లభిస్తుందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. హెల్త్ కార్డ్, రేషన్ కార్డు, పెన్షన్ కార్డులను వేర్వేరుగా ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తమ కమిటీ ఆలోచించిందని చెప్పారు. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించామని తెలిపారు. 15 రోజులకు ఒకసారి తమ కమిటీ సమావేశం అవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో పిటీషన్ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని అన్నారు. రేషన్ అవసరం లేకపోతే ఆ మేరకు నగదు బదిలీపై చర్చిస్తున్నామని తెలిపారు. కోటి 46 లక్షల రేషన్ కార్డులకు నగదు ఇస్తే ధాన్యం ఎవరు కొంటారని ప్రశ్నించారు. బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తే ధాన్యం కొనరా అని అడిగారు. రేషన్ షాప్లో రేషన్ మాత్రమే కాకుండా అన్ని ప్రొవిజన్లు ఉండేలా చూసే ఆలోచన కూడా ఉందని అన్నారు. ఇప్పుడు అవసరం ఉన్న వారికి రేషన్ ఇంటి డెలివరీ అవుతుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
Also Read : Tuni Case : తుని రైల్వే స్టేషన్ కేసుపై ఏపీ సర్కార్ కీలక అప్డేట్
