Rupee Symbol: తమిళనాడు బడ్జెట్‌ లో ₹ స్థానంలో ‘రూ’ను చేర్చిన స్టాలిన్‌ ప్రభుత్వం

తమిళనాడు బడ్జెట్‌ లో ₹ స్థానంలో ‘రూ’ను చేర్చిన స్టాలిన్‌ ప్రభుత్వం

 

 

కేంద్రప్రభుత్వం అమలు చేయదలచిన జాతీయ విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ లోగోలో ‘రూపే’ చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో ‘రూ’ (రూబాయ్‌) అనే అక్షరానికి చోటు కల్పించింది. దీనితో హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాష విధానాన్ని ప్రవేశపెడుతూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. త్రిభాషల్లో హిందీని గుర్తించబోమని తేల్చిచెబుతోంది.

తాజా నిర్ణయంపై గురువారం సీఎం స్టాలిప్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో స్పందించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందేలా తమిళనాడు రాష్ట్రా న్ని అభివృద్ధి పరచడం కోసమే తాజా మార్పు చేసిన ట్టు ఆయన చెప్పారు. ద్రవిడియన్‌ నమూనా, టీఎన్‌బ డ్జెట్‌ 2025 అనే హ్యాష్‌ట్యాగ్‌ను దానికి జోడించారు. రూపే లోగోను తాము తిరస్కరించలేదని, మాతృభాష తమిళానికి తగిన ప్రోత్సాహం మాత్రమే అందిస్తున్నామని అధికారిక డీఎంకే ప్రతినిధి ఎ.శరణవన్‌ వివరణ ఇచ్చారు. బడ్జెట్‌ లోగోలో హిందీని తొలగించిన విషయం సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

ఈ చర్యను ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ఓ తమిళుడు.. అది కూడా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఉదయకుమార్‌ రూపొందించిన రూపే చిహ్నాన్ని తొలగించడం గర్హనీయమన్నారు. ఆ చిహ్నాన్ని బడ్జెట్‌ లోగో నుంచి తొలగించడం సీఎం స్టాలిన్‌ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. దేశం దృష్టిలో తమిళులను అపహాస్యం పాలు చేశారంటూ స్టాలిన్‌పై మండిపడ్డారు. బీజేపీ ఐటీ జాతీయ విభాగం అధ్యక్షుడు అమిత్‌ మాలవీయా కూడా స్టాలిన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ, ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. పిచ్చి చేష్టలు మానాలని, రాష్ట్ర హక్కులు పేరిట ప్రజలను రెచ్చగొట్టవద్దు అని స్టాలిన్‌కు ఏఐడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్‌ సూచించారు.

అది ప్రభుత్వ ఇష్టం: రూపే రూపశిల్పి

రూపే చిహ్నం రూపశిల్పి ఉదయకుమార్‌ ధర్మలింగం ఐఐటీ గువాహటీలో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. తాజా వివాదంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. డీఎంకే నాయకుడు తన తండ్రి కావడానికీ, రూపే లోగో రూపకల్పనకూ ఎటువంటి సంబధం లేదని ఆయన తెలిపారు. అది కేవలం కాకతాళీయమని పేర్కొన్నారు. ‘‘రూపే ఆకృతిని మార్చి, దాని స్థానంలో సొంత ఏర్పాటు చేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. అది పూర్తిగా ప్రభుత్వ ఇష్టం. దీనిపై నేను స్పందించడానికి ఏమీ లేదు.’’ అని ఉదయకుమార్‌ తెలిపారు. వృద్ధుడైన తన తండ్రి ప్రస్తుతం గ్రామంలో సుఖంగా జీవిస్తున్నారని చెప్పారు. కాగా, ధర్మలింగం 1971 నుంచి డీఎంకేలో పనిచేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

Leave A Reply

Your Email Id will not be published!