తిరుమల : తిరుమలలో శ్రీవారిని దర్శించు కునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ పాలక మండలి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి సమీక్ష చేపట్టారు. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా టీటీడీలో కొనసాగుతున్న అన్ని ఇంజనీరింగ్ పనులు గడువులోగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అమరావతి వెంకటపాలెం శ్రీ ఎస్వీ ఆలయ విస్తరణతో పాటు దేశ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న ఆలయాలు, కల్యాణ మండపాలు, భజన మందిరాలు తదితర అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. వచ్చే వేసవి దృష్ట్యా తిరుమల–తిరుపతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, క్యూలైన్లు, రహదారులు, తాగునీటి సౌకర్యాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్బంగా చెప్పారు. ఇదిలా ఉండగా కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే ఈవో ఫుల్ ఫోకస్ పెట్టారని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని కళ్యాణ మండపాల నిర్వహణ మరింత పెరగాలన్నారు.
ఇదే క్రమంలో ఈనెల 9వ తేదీ నుంచి శ్రీవాణి టోకెన్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ మేరకు ప్రయోగాత్మకంగా ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఎయిర్ పోర్టులో మాత్రం యధావిధిగా శ్రీవాణి టోకెన్లు ఇస్తున్నట్లు తెలిపారు.
