Yanamala TDP : ఏపీ మాజీ ముఖ్యమంత్రి పై భగ్గుమన్న టీడీపీ సీనియర్ నేత

అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం సొంత చిన్నాన్న కుటుంబాన్నే మోసం చేశారన్నారు...

Yanamala : రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు(Yanamala) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌సీఎల్‌టీలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయారన్నారు. అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు, జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆస్తుల వివాదం కాదని.. ఇది రాజకీయ ఆత్మహత్యే అని.. చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశారంటూ మండిపడ్డారు. వాళ్ల కుటుంబ తగాదాలు వాళ్లే రోడ్డుకీడ్చుకుని ఆ బురద మీడియాపైకి నెట్టడం హాస్యాస్పదమన్నారు. షర్మిలకిచ్చిన రూ.200 కోట్లు జగన్‌‌కు ఎక్కడివని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడంలేదని అడిగారు.

Yanamala Ramakrishna..

గత నాలుగైదు రోజులుగా పుంఖానుపుంఖాలుగా జగన్(YS Jagan) అక్రమాస్తుల రగడ మీడియాలోనే కాదు, పబ్లిక్‌గా జరుగుతుంటే ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల్లో కదలికలేవి అని నిలదీశారు. క్విడ్ ప్రో కో 1.0, క్విడ్ ప్రో కో 2.0 ప్రో కో కేసులన్నీ ఇప్పటికైనా ఒక కొలిక్కి తేవాలని.. ఒక ఆర్ధిక నేరస్తుడు 11 ఏళ్లుగా బెయిల్‌పై ఉండటమేమిటని అన్నారు. 136 డిశ్చార్జి పిటిషన్లు వేసి తనపై కేసుల విచారణను ముందుకు సాగకుండా ఆర్థిక ఉగ్రవాది ఇలా న్యాయవ్యవస్థకే కొరుకుడు పడని కొయ్యగా మారితే, దర్యాప్తు సంస్థలకే పెను సవాళ్లు విసురుతుంటే భారత రాజ్యాంగం ఉనికికే ప్రమాదమన్నారు. భారత శిక్షాస్మృతికే అవమానమన్నారు.

‘‘కుటుంబ యుద్ధం – అక్రమాస్తుల కోసం సిగపట్లు – జగన్ పొలిటికల్ సూసైడ్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేక మంది వైసీపీని వీడుతున్నారని.. సురక్షిత ఆశ్రయం కోసం వేరే పార్టీల్లో చేరుతున్నారన్నారు. ఇక భవిష్యత్తులో జగన్‌ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే అని.. అందుకే ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న ఆరాటంతో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్‌గా పోటీబడి వైసీపీ నుంచి దూకేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సగం మునిగిపోయిన నావ, పూర్తిగా మునిగిపోకముందే అందరూ దూకేయడం బెటర్ అని ఉచిత సలహా ఇచ్చారు. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని.. పాత కేసులకు తోడు కొత్త కేసులు అనేకం ఆయన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌తో ఉంటే అది ఆత్మహత్యాసదృశ్యమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కొడుకుగా తల్లిదండ్రులను మోసం చేశాడు. అన్నగా చెల్లెళ్లకు మోసం చేశాడు. పార్టీ పెట్టి నాయకులను, కార్యకర్తలను మోసం చేశాడు. అధికారం చేపట్టి అన్నివర్గాల ప్రజలను మోసం చేశాడు’’ అంటూ మండిపడ్డారు.

అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం సొంత చిన్నాన్న కుటుంబాన్నే మోసం చేశారన్నారు. చిన్నాన్నను కిరాతకంగా హత్య చేసిన హంతకులకు రక్షణ కల్పించడమే కాదని.. ఆ పాపంలో తానూ భాగస్వామి అయ్యారన్నారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి సునీత ఉసురు పోసుకున్నారని.. వాళ్ల కన్నీళ్లే వైసీపీకి శాపాలయ్యాయన్నారు. ఇప్పుడు ఏకంగా తల్లిని, చెల్లిని ఏడిపిస్తున్నాని.. సీఎంగా గత ఐదేళ్లలో 8 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు చేశారంటూ యనమల రామకృష్ణుడు(Yanamala) ఆరోపణలు గుప్పించారు.

Also Read : MLA Harish Rao : తెలంగాణ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!