HYDRA : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాను మరింత పటిష్టం చేయాలని పలువురు భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో సంవత్సరాలుగా కబ్జాదారుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు హైడ్రా(HYDRA) పరిష్కారం చూపుతోందన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరం, శివారు ప్రాంతాలకు చెందిన బాధితులు నాగేశ్వరరావు, సాయికుమార్, చంద్రశేఖర్, తనూజ, శ్రీనాథ్, గాయత్రి, నవీన్ కుమార్ మాట్లాడారు.
TG-HYDRA Updates
రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా వంటి మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిందని, కబ్జాదారుల బారి నుంచి తమను రక్షిస్తుందని చెప్పారు. కొంత మంది కబ్జాదారులు హైడ్రాపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారంచేయిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా హైడ్రా ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందని చెప్పారు.
పార్కులు,చెరువులు, ప్రభుత్వ స్థలాను కబ్జా చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన బాధితులపై కక్షపూరిత కేసులు నమోదు చేస్తున్నారని, సీఎం స్పందించి బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు తమకు హైడ్రా చేసిన మేలును, కబ్జాదారులు వేధిస్తున్న వివరాలను పలువురు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దివ్యనగర్, కోహెడ, అమీన్పూర్, నాగిరెడ్డి చెరువు, ముత్తంగి, బడంగ్ పేట్ తదితర ప్రాంతాల్లో హైడ్రా వల్ల లబ్ధిపొందిన వారు పాల్గొన్నారు.
Also Read : Delhi CM Oath Ceremony : మరికొద్దిసేపట్లో ‘రేఖ గుప్త’ ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం