Wrestlers Protest : మహిళా రెజ్లర్ల కేసులో పురోగతి
డబ్ల్యూఎఫ్ఐ సిబ్బంది నుంచి వాంగ్మూలం
Wrestlers Protest : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లర్ల కేసుకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజర్ల(Wrestlers) సమాఖ్య చీఫ్, యూపీకి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ ఖాకీలు రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో ఒక కేసులో మహిళా రెజ్లర్లు తమను లైంగికంగా, మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు.
మరో కేసు మైనర్ బాలిక పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ తనపై కావాలని నమోదు చేశారు తప్ప తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఇప్పటికే స్పష్టం చేశారు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సింగ్.
మంగళవారం ఈ కేసులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితులైన మహిళా రెజ్లర్ల నుండి, మైనర్ బాలికను ఆమె తండ్రి సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఢిల్లీ నివాసంలోని కొంత మంది సిబ్బందిని కూడా పిలిపించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా జూన్ 9న మహిళా రెజ్లర్లకు మద్దతుగా భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. ప్రస్తుతానికి రెజ్లర్లతో హోం శాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారని ,ప్రస్తుతం విచారణ వేగవంతంగా కొనసాగుతోందని అందుకే ఆందోళనను వాయిదా వేసినట్లు ఎస్కేయూ ప్రకటించింది. ఈ సందర్భంగా అమిత్ షా రెజ్లర్లతో చట్టం అందరికీ ఒకేలా ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
Also Read : Bandi Sanjay : దొర పాలనలో నిలువు దోపిడీ – బండి
