YS Jagan: కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ – వైఎస్ జగన్‌

కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ - వైఎస్ జగన్‌

YS Jagan : వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం త్వరలో ఓ అప్లికేషన్‌(యాప్‌) తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పీఏసీలో జగన్ (YS Jagan) మాట్లాడుతూ… ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్‌ విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయొచ్చు. ఫలానా వ్యక్తి లేదంటే ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి. దానికి తగిన ఆధారాలను కూడా జత చేయొచ్చు(అప్‌లోడ్‌). అటుపై.. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్‌గా వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ సర్వర్లోకి వచ్చేస్తుంది.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. చంద్రబాబు (CM Chandrababu) ఏదైతే విత్తారో… అదే చెట్టవుతుంది. అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని… తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని జగన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

YS Jagan – నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబు – వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని… సీనియర్‌ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… 2029 తరువాత టీడీపీ వారంతా జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… మిథున్‌రెడ్డి అరెస్ట్‌ బాధాకరమన్నారు.

‘‘మిథున్‌ ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్‌ కు ఏం సంబంధం ?. మిథున్‌ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు.

కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్‌ రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్‌ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్‌ కొడుకు లండన్‌ లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్‌, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్‌ వద్ద తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు.

Also Read : Annadata Sukhibhava: రైతులకు శుభవార్త ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ నిధులు జమ

Leave A Reply

Your Email Id will not be published!