YS Jagan: డీలిమిటేషన్ మీటింగ్ కు వైసీపీ డుమ్మా ! ప్రధానికి వైఎస్ జగన్ లేఖ !
డీలిమిటేషన్ మీటింగ్ కు వైసీపీ డుమ్మా ! ప్రధానికి వైఎస్ జగన్ లేఖ !
YS Jagan : నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నై వేదికగా అఖిలపక్షం భేటీ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అయితే ఈ అఖిలపక్ష భేటీకు వైసీపీకు ఆహ్వానం అందినప్పటికీ… ఆ పార్టీ తరపున ఎవరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం… డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకు లేఖ రాసినట్లు చెప్తోంది. ఈ మేరకు ఆ లేఖను మీడియాకు విడుదల చేసారు.
YS Jagan Skip
ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు.
‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ గనుక చేపడితే… తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.
పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్సభ ఇటు రాజ్యసభలో… ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు.
Also Read : Posani Krishna Murali: జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి