YS Sharmila : 10వ తరగతి పేపర్ల రీకౌంటింగ్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోందని..

YS Sharmila : పేపర్ల మూల్యాంకనంపై వైఎస్ జగన్, మంత్రి లోకేష్‌ల వాదనలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్‌పై మాజీ సీఎం జగన్(YS Jagan), మంత్రి నారా లోకేష్ మధ్య జరుగుతున్న వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని అన్నారు. వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో.. 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే.. పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని షర్మిల(YS Sharmila) అన్నారు.

YS Sharmila Key Comments

ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోందని.. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయిందని షర్మిల అన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు. వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదని.. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలేనని అన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రం ఫెయిల్ అవుతూనే ఉందని.. పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారని షర్మిల ప్రశ్నించారు.

చదువులతో చెలగాటం ఆడుతున్నారని, విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థను ఉద్ధరించడం మీద లేదని అన్నారు. 30 వేల మంది విద్యార్థులకు సంబంధించి 60 వేల పేపర్ల రీ కౌంటింగ్‌కు వస్తే అందులో 11 వేల మందికి అత్యున్నత మార్కులు వచ్చాయంటే పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఫెయిల్ అయినట్లేనని, వెంటనే విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ మళ్ళీ రీ వెరిఫికేషన్ ఉచితంగా చేయాలని షర్మిలా రెడ్డి కోరారు.

Also Read : Tirumala : మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం

Leave A Reply

Your Email Id will not be published!