YS Sharmila Slams : కూటమి సర్కార్ లో కాలయాపన తప్ప అభివృద్ధి లేదు
రాష్ట్ర పునర్ నిర్మాణం అంటూ కాలయాపన తప్పా....
YS Sharmila : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.. ప్రజల అంచనాలకు భిన్నంగా 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించిందని విమర్శించారు. ఇవాళ(మంగళవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో షర్మిల(YS Sharmila) మాట్లాడారు. గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని.. కూటమి కరపత్రాన్ని చదివించారని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్పా.. మేనిఫెస్టో హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన ఎక్కడా లేదని అన్నారు. 8 నెలలు దాటినా ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇంకా ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదని చెప్పారు. జాబ్ క్యాలెండర్ లాంటి మిగతా హామీలపై అసలు ప్రస్తావనే లేదని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.
YS Sharmila Slams
రాష్ట్ర పునర్ నిర్మాణం అంటూ కాలయాపన తప్పా.. పథకాలను అమలు చేస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు.. గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని అన్నారు. జలయజ్ఞం కింద చేపట్టిన దాదాపు 30 ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా మూలుగుతుంటే .. వాటిని పూర్తి చేసే చిత్తశుద్ది కూడా కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పారు. రూ.3వేల నిరుద్యోగ భృతి కోసం 50 లక్షల మంది యువత… 84 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఎకరానికి రూ.20 వేలు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కోసం 54 లక్షల మంది రైతులు.. ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకం కోసం కోటి మంది మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. పేదవాళ్లకు సొంత ఇంటి కోసం చేపట్టిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం లేదని చెప్పుకొచ్చారు. అందుకే ఈ నెల 28వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల ఆశయాలకు అద్దంపట్టేలా ఉండాలని,.. సూపర్ సిక్స్ హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేసేలా నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Also Read : PM Narendra Modi : అస్సాం అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.o లో మోదీ కీలక వ్యాఖ్యలు
