YSRCP: నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం
YSRCP : నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం అల్లూరులో వైసీపీ ఫ్లెక్సీల కలకలం రేగింది. ‘జగనన్నా.. మాకు దిక్కెవరన్నా’ అంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కావలి నియోజకవర్గంలో దాదాపు వైసీపీ ఖాళీ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై స్వంత పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రామిరెడ్డిపై ముఖ్య అనుచరులే రివర్స్ అవుతున్న పరిస్థితి. రామిరెడ్డి అవినీతి, అక్రమాలు, అరాచకాలు అంటూ ఇటీవల ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ బహిర్గతం చేశారు.
YSRCP Flexies Viral
అంతేకాకుండా మరో నలుగురు ముఖ్య అనుచరులు, పెద్ద సంఖ్యలో శ్రేణులు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వెన్నుపోటు దినోత్సవం రోజే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కావలి రూరల్ మండలంలో కూడా ప్రజాప్రతినిధులు, మత్స్యకారనేతలు అంతా కూడా సమావేశమయ్యారు. వైసీపీలో(YSRCP) పరిస్థితులు బాగోలేవని, కనీసం పట్టించుకునే దిక్కుకూడా లేదని వెంటనే టీడీపీలోకి వెళ్లిపోవాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు దగదర్తి మండలంలో ప్రజాప్రతినిధులంతా కూడా వైసీపీకి(YSRCP) వ్యతిరేకంగా ఉపాధ్యక్షుడిని ఎన్నుకున్నారు. త్వరలోనే ప్రజాప్రతినిధులంతా కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు కావలి టౌన్లో కూడా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి చెందిన నలుగురు ముఖ్య అనుచరులు అంతా కూడా పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో వారం పదిరోజుల్లో వీరంతా కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి.
నెల్లూరులో ఏ ప్రాంతంలో చూసినా నేతలంతా కూడా వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న అతికొద్ది మాత్రం తమ పరిస్థితి ఏంటి అనేది తెలియని సందిగ్ధంలో పడ్డారు. పదిహేనేళ్ల పాటు పార్టీ జెండాలు మోసామని, కనీసం పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓ వైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉండగా.. మరోవైపు కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కనీసం ఫోన్లో కూడా స్పందించని పరిస్థితి అంటూ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ను ప్రశ్నిస్తూ అల్లూరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Also Read : Drugs: విజయవాడలో భారీగా డ్రగ్స్ స్వాధీనం