హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉద్యోగులంతా ఈ 99 రోజుల కార్యాచరణను ఒక దీక్షలా చేస్తే పేదలందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసిన వారవుతారని అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేలు చేయడానికే ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరిస్తే చివరి పేదవాడి వరకు సంక్షేమ ఫలాలు అందించడంలో న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్కరోజూ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ సూచించారు. ఒక్క రోజు నిర్లక్ష్యం 10 దళిత కుటుంబాలకు న్యాయం జరక్కుండా పోవచ్చు అని పేర్కొన్నారు సీఎం. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు ప్రభుత్వ ఉద్యోగులే అని అన్నారు.
ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించిన నేపథ్యంలో మాదిగ ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రికి అభినందన సభ నిర్వహించారు. ఎంతో అభిమానంతో ఈ సభను ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల హక్కులను కాపాడటానికి, వాటిని చట్టబద్ధం చేసి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతిలోపు మాదిగల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తాం అని ప్రకటించారు సీఎం. భవిష్యత్తులో మాదిగలకు ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. చట్టబద్ధమైన హక్కులను కాపాడు కోవలసిన బాధ్యత మీపై ఉందన్నారు.