Indians Arrest: కంబోడియాలో 105 మంది భారతీయులు అరెస్టు
కంబోడియాలో 105 మంది భారతీయులు అరెస్టు
Indians Arrest : సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లను పట్టుకునేందుకు కంబోడియాలో పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు 138 ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో పలు దేశాలకు చెందిన 3 వేల మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిసింది. అరెస్టయిన వారిని భారత్కు రప్పించేందుకు కంబోడియా అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
గత నెల కంబోడియా (Cambodia), భారత్ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. భారత్ సహా పలు దేశాలకు చెందిన వ్యక్తులు కంబోడియా కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని న్యూదిల్లీ వివరించింది. ఇందుకు సంబంధించి కొంత కీలక సమాచారాన్ని కూడా ఆ దేశ అధికారులతో పంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కంబోడియా అధికారులు తాజాగా సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
Indians Arrest – థాయ్-కంబోడియా వివాదం ఏమిటంటే ?
సైబర్ నేరాలకు పాల్పడుతున్న మొత్తం 20 దేశాలకు చెందిన 3,075 మందిని స్థానిక అధికారులు అరెస్టు చేశారు. వీరిలో భారత్తో పాటు చైనా, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాలకు చెందిన వారున్నారు. అత్యధికంగా 1028 మంది చైనా పౌరులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద భారత్, చైనా పోలీసుల నకిలీ యూనిఫామ్లు, ఆయుధాలు, ఇతర నార్కోటిక్స్ ఉన్నట్లు గుర్తించారు.
అరెస్టయిన భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్కు వ్యతిరేకంగా సైబర్ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. కంబోడియాలో ఉద్యోగాల పేరుతో యువకులను పిలిపించి.. అక్కడ వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న ఘటనలు ఆ మధ్య వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలా చిక్కుకుపోయిన యువకులను రక్షించేందుకు కూడా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
Also Read : Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
