Children: అన్నదాన కార్యక్రమంలో ప్రమాదం ! 16 చిన్నారులకు గాయాలు !
అన్నదాన కార్యక్రమంలో ప్రమాదం ! 16 చిన్నారులకు గాయాలు !
Children : విశాఖలో అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడి 16 మంది చిన్నారులతో సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖలోని జాలరిపేట పిల్లా అప్పమ్మయ్య సంఘం వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Children Injured
శనివారం దుర్గాదేవి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దఎత్తున చిన్నారులు (Children), మహిళలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వంట చేస్తున్న ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి 16 మంది చిన్నారులు, మహిళలపై పడింది. ఆ నొప్పి తట్టుకోలేక వారంతా విలవిల్లాడారు. గట్టిగా కేకలు పెట్టారు. అక్కడున్న వారంతా వెంటనే బాధితులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఇక, గాయపడ్డ వారిలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రగాయాలైన ఆరుగురిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపించాలని వైద్యులు నిర్ణయించారు. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణితో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ సైతం గాయపడ్డ చిన్నారులను విశాఖ కేజీహెచ్కు వెళ్లి పరామర్శించారు.
Children – చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన
విశాఖ సీతంపేటలోని బెల్లం గణపతి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టరును ఆదేశించారు. దుర్గాదేవి మండపం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం వద్ద గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనలో చిన్నారులకు ఎలాంటి ఆపద లేదని కలెక్టర్ తెలిపారు. మొత్తంగా 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లామని.. ఆరుగురు చిన్నారులకు గాయాలు కొంచెం ఎక్కువగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఇక స్వల్పంగా గాయాలైన పిల్లలకు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని… ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు చెప్పారు.
గురుకుల పాఠశాలలో 60 మందికి పచ్చకామెర్లు
పచ్చకామెర్లు, విష జ్వరాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థినులు హడలిపోతున్నారు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో 60 మంది పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారని, మరో 19 మందిని మెరుగైన వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు తరలించామని సూపరింటెండెంట్ వాణి తెలిపారు. దసరా సెలవులకు బాలికలు ఇళ్లకు వెళ్లారని, అక్కడి నుంచి వచ్చాక వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్నారు. కురుపాం గురుకుల పాఠశాలలో 38 మందికి పచ్చకామెర్లు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. వైద్య బృందం కురుపాం గ్రామంలో నీటి నమూనాలను సేకరించిందని, పీడియాట్రిక్ వైద్యులు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
Also Read : PM Dhan Dhanya Yojana: పీఎం ధనధాన్యయోజనలో ఏపీ నుంచి 4 జిల్లాలకు చోటు
