RS Praveen Kumar : ప్రజల కోసం ప్రభుత్వంపై యుద్దం
తప్పదని ప్రకటించిన ఆర్ఎస్పీ
RS Praveen Kumar : బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో పాలన పక్కదారి పట్టిందన్నారు. మంత్రులు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పాత రోజులు పోయినవని, కొత్త రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు.
బహుజనులను ఓటు బ్యాంకుగా చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మార్పు తధ్యమన్నారు. రాష్ట్రంలో విద్య , వైద్యం పడకేసిందని, ఇక ఉపాధి గాలిలో దీపం లాగా మారిందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రూ. 2 వేలకు బీర్లు, బిర్యానీలు ఇస్తే ఓట్లు వేస్తారని ప్రజా ప్రతినిధులు అనుకుంటున్నారని షాక్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉందన్నారు
రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీలు ఉంటే కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పమంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ నోరు విప్పడం లేదని మండిపడ్డారు బీఎస్పీ చీఫ్(RS Praveen Kumar) .
బీసీ కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 82 వేల కోట్ల అప్పు తెచ్చారని ఇందులో బీసీలు ఎంత మంది కాంట్రాక్టర్లు ఉన్నారో సీఎం, నిరంజన్ రెడ్డి చెప్పాలన్నారు. దో నంబర్ చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పెబ్బేరు వేణుగోపాల స్వామి గుడి భూమిని పాలకులు కబ్జా చేశారని మండిపడ్డారు. కవిత చేతికి రూ. 20 లక్షల గడియారం ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.
Also Read : జగదీశ్ షెట్టర్ అరుదైన నాయకుడు