TSRTC: తెలంగాణా ఆర్టీసీకి అవార్డుల పంట !

తెలంగాణా ఆర్టీసీకి అవార్డుల పంట !

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో టీఎస్‌ఆర్టీసీని ఐదు అవార్డులు వరించాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీల్లో ఈ పురస్కారాలు దక్కాయి. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు మరో ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది.ఈ ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల 15న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది.

TSRTC Updates

టీఎస్ఆర్టీసీ ఐదు జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల… రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయన్నారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. టీఎస్‌ఆర్టీసీ(TSRTC) దేశానికే రోల్‌ మోడల్‌ గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు.

Also Read : BJP First List: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల !

Leave A Reply

Your Email Id will not be published!