Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు !
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు !
Arvind Kejriwal: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. లిక్కర్ కేసులో తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నిబంధనల ప్రకారం బెయిల్ గడువు ముగిసిన వెంటనే కేజ్రీవాల్ తిరిగి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్ళారు.
అయితే ఈ కేసులో కేజ్రీవాల్(Arvind Kejriwal) కు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి గురువారం ఉదయం (జూన్ 20న) తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి నియాయ్ బిందు… అదే సాయంత్రం బెయిల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, బెయిల్ బాండుపై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటలపాటు స్టే విధించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. తద్వారా ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేసేందుకు వీలు కలుగుతుందని విన్నవించింది. అయినప్పటికీ ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు.. అందుకు నిరాకరించింది. దీనితో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. లక్ష రూపాయల పూచీకత్తుతో మరికొన్ని గంటల్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Arvind Kejriwal – సత్యమేవ జయతే – అతిశీ
కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయడంపై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ సత్యమే గెలిచిందన్నారు. సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావొచ్చేమో గానీ… ఓటమి మాత్రం ఉండదన్నారు.
Also Read : Bhartruhari Mahtab: లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ !