Atishi Marlena: పక్కన ఖాళీ కుర్చీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ !
పక్కన ఖాళీ కుర్చీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ !
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆప్ నేత ఆతిశీ… తన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆమె ఆప్ అధినేత ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆప్ తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) లో షేర్ చేసింది.
అనంతరం సీఎం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ రామాయణంలోని ఓ సందర్భాన్ని ప్రస్తావించారు. ‘‘నాకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు… భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్ ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఢిల్లీలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నాను. ఆయన తిరిగివచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుంది’’ అని ఆతిశీ అన్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్… సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించగా… ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించడంతో… రెండు రోజుల క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు.
దీనికిముందు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ…‘‘ఢిల్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోనని కేజ్రీవాల్ అన్నారు. అయితే గత ఎన్నిల్లో ప్రజల తీర్పు మేరకు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ కుర్చీ ఆయనకే చెందుతుంది. వచ్చే ఎన్నికలు జరిగేవరకు మాలో ఒకరు కుర్చీలో కూర్చుంటారు. రాముడు లేనప్పుడు(రామాయణంలో) భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో, మాలో ఒకరు దిల్లీకి సీఎంగా ఉంటారు’’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.