Satya Nadella : 2024 లో మైక్రోసాఫ్ట్ సీఈవో కు మైండ్ బ్లోయింగ్ ఇంక్రిమెంట్

కంపెనీ చక్కటి పనితీరును కనబరచడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించింది...

Satya Nadella : గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella) అమెరికాలో జూన్‌ నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024కి గానూ పెద్ద మొత్తంలో శాలరీ అందుకున్నారు. ఏకంగా 79.1 మిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందారు. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారుగా రూ.665 కోట్లుగా ఉంది. కృత్రిమ మేధలో (ఏఐ) మైక్రోసాఫ్ట్‌కు సుస్థిర స్థానాన్ని ఏర్పరచేందుకు, కంపెనీ విస్తరణకు విశేషంగా కృషి చేసినందునగానూ క్రితం ఏడాదితో పోల్చితే ఏకంగా 63 శాతం ఇంక్రిమెంట్‌తో ఈ ఏడాది భారీ మొత్తంలో జీతం చెల్లించింది. అయితే చెల్లించిన జీతంలో 90 శాతం మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలోనే ఉంటుందని కంపెనీ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏడాది 2014లో గరిష్ఠంగా 84 మిలియన్ డాలర్ల జీతాన్ని అందుకున్నారని, ఆ తర్వాత ఈసారే అత్యధికమని గురువారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వివరించింది.

Satya Nadella..

సైబర్‌ సెక్యూరిటీ రిస్క్‌ల విషయంలో కంపెనీ మార్పులకు అనుగుణంగా ‘వ్యక్తిగత జవాబుదారీ’గా ఉండేందుకు తన శాలరీలో కోత విధించాలంటూ సత్య నాదెళ్ల అభ్యర్థించారని, లేదంటే 2024లో అదనంగా మరో 5 మిలియన్ డాలర్లు స్వీకరించేవారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కంపెనీ పనితీరును కూడా మైక్రోసాఫ్ట్ బోర్డు సమీక్షించింది. సత్య నాదెళ్ల కంపెనీకి అద్భుతమైన నాయకత్వాన్ని అందించారని బోర్డు కొనియాడింది. కంపెనీ చక్కటి పనితీరును కనబరచడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించింది. కంపెనీ పెట్టుబడులు, ప్రాధాన్యతల విషయంలో వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నారని మైక్రోసాఫ్ట్ జీతాల చెల్లింపు బోర్డు పేర్కొంది. ఇక మైక్రోసాఫ్ట్ ఫైలింగ్ ప్రకారం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్ వేతనం 2024 ఏడాదిలో 25.8 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.216 కోట్లు) పెరిగింది. అంతకుముందు ఏడాది జీతంతో పోలిస్తే 30 శాతం పెరుగుదల నమోదయింది. ఇక కంపెనీ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ 29 శాతం ఇంక్రిమెంట్‌‌తో 23.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.196 కోట్లు) అందుకున్నారు.

Also Read : Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్స్

Leave A Reply

Your Email Id will not be published!