Supreme Court of India: జస్టిస్ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ
జస్టిస్ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ
Supreme Court of India : అగ్నిప్రమాదంతో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ శుక్రవారం ఇచ్చిన అంతర్గత విచారణ నివేదిక మేరకు… శనివారం త్రిసభ్య కమిటీని నియమించారు. సమగ్ర విచారణ జరపనున్న ఈ కమిటీలో పంజాబ్-హరియాణా హైకోర్టు సీజే జస్టిస్ శీల్నాగు, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు.
Supreme Court of India orders on Justice Varma
అగ్ని ప్రమాదం సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ.. శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు.
అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yeswanth Varma) వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనరు అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని శనివారం రాత్రి తన వెబ్సైట్లో సుప్రీంకోర్టు(Supreme Court of India) ఉంచింది. నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలూ ఉన్నాయి. అగ్ని మాపకశాఖ ఆపరేషన్ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఇలా ఆధారాలను అప్లోడ్ చేయడం మొదటిసారి కాగా… పూర్తి పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది.
జస్టిస్ వర్మ వివరణలో… తాను ఆ క్లిప్పింగ్లను చూసి, షాక్కు గురైనట్లు తెలిపారు. ‘‘ఆ దృశ్యాలు మా ఇంటి వద్ద జరిగిన ప్రమాదానివి కాదు. నాపై కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోంది’’ అని వివరణ ఇచ్చారు. కాగా.. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే సీజేఐ కొలీజియం భేటీని ఏర్పాటు చేయడానికి ఓ వీడియో క్లిప్పింగ్ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఈనెల 14న వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్ను ఉన్నతాధికారులకు పంపగా.. వారు సీజేఐకి చేరవేశారు. ఆ క్లిప్పింగ్ ఆధారంగానే వర్మ బదిలీ, అంతర్గత విచారణకు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జస్టిస్ వర్మ నేపథ్యం ఇదే
ప్రయాగ్రాజ్లో 1969 జన్మించిన యశ్వంత్ వర్మ(Justice Yeswanth Varma) మధ్యప్రదేశ్లోని లా యూనివర్సిటీ నుంచి 1992లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరం అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2006 వరకు అక్కడే ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. 2012-13లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. 2014లో అదనపు న్యాయమూర్తిగా నియమితులై… 2016లో అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబరు 11 నుంచి ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నారు. కాగా.. శుక్రవారం నుంచి వర్మ సెలవులో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఢిల్లీ హైకోర్టులో సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కంపెనీ అప్పీళ్లు వంటి కేసులను విచారించే కీలక ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నారు.
Also Read : Popular Writer-Jnanpith Award: ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు