Air India: ఒక్కరోజే ఆరు ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు రద్దు
ఒక్కరోజే ఆరు ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు రద్దు
Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియా డ్రీమ్లైనర్ విమానాలకు తనిఖీలు కొనసాగుతుండటంతో అనేక సర్వీసులకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఎయిరిండియాకు చెందిన ఆరు అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. రద్దయిన ఆరు ఎయిర్ ఇండియా (Air India) విమానాలు కూడా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాలే కావడం గమనార్హం. వీటిలో కొన్ని సాంకేతిక సమస్యలతో రద్దు కాగా… మిగతావి డ్రీమ్లైనర్ విమానాల తనిఖీల నేపథ్యంలో నిలిచిపోయినట్లు సమాచారం.
Air India Services Cancelled
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాల మేరకు ఎయిరిండియా (Air India) డ్రీమ్లైనర్ విమానాలకు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 17న ఆరు అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో AI 153(ఢిల్లీ-వియన్నా), AI 143(ఢిల్లీ-పారిస్), AI 159 (అహ్మదాబాద్-లండన్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్)లతో పాటు ముంబయి-శాన్ ఫ్రాన్సిస్కో సర్వీసులు ఉన్నాయి. శాన్ఫ్రాన్సిస్కో విమానానికి కోల్కతాలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించినట్లు సమాచారం. దీనితో ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు అహ్మదాబాద్-లండన్ మధ్య నడిచే విమాన సర్వీసును కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సదరు విమానయాన సంస్థ వెల్లడించింది. డీజీసీఏ ఆదేశాల మేరకు తనిఖీలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే కొన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది. అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది. విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు… బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు.
Air India – అహ్మదాబాద్ ఘటనలో 162 మంది మృతదేహాలు గుర్తింపు
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 162 మందిని గుర్తించగా… వాటిలో 120 మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. మిగతా వారిని గుర్తించేందుకు వారి కుటుంబీకుల డీఎన్ఏ నమూనాలతో సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
విమానాల నిర్వహణపై దృష్టి పెట్టండి ఎయిరిండియాకు డీజీసీఏ ఆదేశం
అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటనతో పాటు ఎయిరిండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలకు ఉపక్రమించింది. విమానాల నిర్వహణ, భద్రతపై దృష్టి పెట్టాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాకుండా చర్యలను కఠినతరం చేయాలని సూచించింది.
అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఎయిరిండియా 171 విమానం కూలిపోయిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈవోను క్యాంప్బెల్ విల్సన్తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సమావేశమయ్యారు. విమానాల భద్రత, నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు. విమాన కార్యకలాపాలను కఠినతరం చేయాలని, సకాలంలో బయలుదేరేలా చూడాలని ఎయిరిండియాను కోరింది.
Also Read : TTD: రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరుకి టీటీడీ ప్రతిపాదన