Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ ?

కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ ?

Komatireddy Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది. ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం ఫోన్‌లో మాట్లాడి కమిటీతో మాట్లాడే వరకు సైలెంట్‌గా ఉండాలని మల్లు రవి రాజ్‌గోపాల్ రెడ్డికి చెప్పనున్నట్లు సమాచారం. రాజ్‌గోపాల్ రెడ్డితో ఫోన్‌లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూలంకషంగా చర్చిద్దామని రాజ్‌గోపాల్ రెడ్డికి (Komatireddy Rajgopal Reddy) మల్లు రవి సూచించనున్నారు.

అయితే, గత కొంతకాలంగా రాజ్‌గోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రాజ్‌గోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలను ప్రతిసారి రాజ్‌గోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. ఆయన వైఖరీ కాంగ్రెస్ పార్టీకి (Congress) నష్టం కలిగిస్తోందని హస్తం పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ కూడా రాజ్‌గోపాల్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేసింది. రాజ్‌గోపాల్ రెడ్డితో మల్లు రవి మాట్లాడి ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Komatireddy Rajgopal Reddy : గాంధీ కుటుంబాన్ని పొగడటానికే కాంగ్రెస్‌ ధర్నా – కిషన్‌రెడ్డి

దిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోవడానికి గాంధీ కుటుంబం అనుగ్రహమే శరణ్యమన్న లక్ష్యంతో రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్పష్టమవుతోందన్నారు. ఆయన ప్రసంగంలో సగం సమయం రాహుల్, సోనియా జపం చేశారని విమర్శించారు. ఈమేరకు బుధవారం సాయంత్రం కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘42% బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. అందుకోసం న్యాయ, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప బట్టకాల్చి భాజపాపై వేస్తామంటే ఊరుకోం. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. కానీ, ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత బయటపడుతుందని గ్రహించి రిజర్వేషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. అంతే తప్ప ఆయనకు బీసీలకు సాధికారత కల్పించే ఉద్దేశం లేదు. హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ఎవరూ పట్టించుకోరని దిల్లీకొచ్చి పగటివేషాలు వేస్తున్నారు. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పారు. దీని ప్రకారం ఇప్పటికే రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ఒక్క రూపాయీ ఇవ్వలేదు.

ఏ ఒక్క బీసీ వర్గాన్ని వదలకుండా అందరినీ నిట్టనిలువునా మోసం చేశారు. పాలనాపరంగా, రాజకీయంగా, ఆర్థికపరంగా ఎదురవుతున్న వైఫల్యాలు బయటపడుతుండటంతో వాటినుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సీట్లలో ముస్లింలు పోటీ చేసి… 50 రిజర్వుడ్‌ సీట్లలో 31 చోట్ల గెలిచారు. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి… 42% రిజర్వేషన్‌ అమలు చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎలా దక్కుతుందో రేవంత్‌రెడ్డి చెప్పాలి. అశాస్త్రీయమైన సర్వే ద్వారా బీసీల సంఖ్యను తగ్గించడంతోపాటు అందులో 10% ముస్లింలను చేర్చి బీసీలను రెండు విధాలా మోసం చేస్తున్నారు. రాజ్యాంగవిరుద్ధ మతపరమైన రిజర్వేషన్లను భాజపా అడ్డుకుని తీరుతుంది. ముస్లింలతో కూడిన బీసీ రిజర్వేషన్లను మేం అంగీకరించం. నరేంద్ర మోదీని విమర్శిస్తే.. అది ఆకాశం మీద ఉమ్మేయడమేనని రేవంత్‌రెడ్డి గుర్తించాలి’ అని కిషన్‌రెడ్డి హితవు పలికారు.

Also Read : CM MK Stalin: సుప్రీంలో డీఎంకే సర్కార్‌ కు ఊరట

Leave A Reply

Your Email Id will not be published!