Rahul Gandhi: ‘ఓటు చోరీ’పై ఇండియా కూటమితో కాంగ్రెస్ పోరుబాట

‘ఓటు చోరీ’పై ఇండియా కూటమితో కాంగ్రెస్ పోరుబాట

Rahul Gandhi : ‘ఓటు చోరీ’ ఆందోళనను కాంగ్రెస్‌ పార్టీ దాని మిత్రపక్షాలతో కలిసి దేశవ్యాప్తంగా మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. దొంగ ఓట్లను ఈసీ అనుమతిస్తుందంటూ ఒక నిమిషం నిడివి గల వీడియోను బుధవారం కాంగ్రెస్‌ పార్టీ (Congress) విడుదల చేసింది. ఆ వీడియోలో ఓ భార్యభర్త ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వస్తారు. ఓ ఇద్దరు వ్యక్తులు అక్కడ వారికి ఎదురుబడి ‘మీ ఓట్లు మేం వేసేశాం.. వెళ్లండి.. వెళ్లండి..’ అంటూ వారిని పంపించివేస్తారు. వారి వెనుక పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారి టేబుల్‌పై ‘ఎలక్షన్‌ చోరీ ఆయోగ్‌’ అని రాసి ఉంటుంది. ఈ వీడియోను రాహుల్‌ (Rahul Gandhi), ఖర్గే, ప్రియాంక షేర్‌ చేశారు. ‘‘మన ఓటును కొల్లగొట్టడం అంటే.. మన అధికారాన్ని కొల్లగొట్టడం.. మన అస్థిత్వాన్ని కొల్లగొట్టడమే..’నని ఈ సందర్భంగా రాహుల్‌, ప్రియాంక అన్నారు.

Rahul Gandhi Key Comments

మరోవైపు దేశంలోని ప్రతి ఒక్కరూ ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా గళం విప్పాలని ఖర్గే ‘ఎక్స్‌’లో పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే బిహార్‌లో ఈనెల 17న ‘ఓట్‌ అధికార్‌’ పేరిట ఇండియా కూటమి పార్టీలు నిరసన ప్రదర్శన జరపనున్నాయి. కాగా, ‘ఓటు చోరీ’పై పెద్ద ఎత్తున ప్రచార, అవగాహన, ఉద్యమ కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ (Congress) రూపకల్పన చేసింది. ఖర్గే, రాహుల్‌గాంధీ నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ ముఖ్యుల భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఆందోళనా యాత్ర’, ఈ నెల 22 నుంచి సెప్టెంబరు 7వరకు ప్రతి రాష్ట్ర రాజధానిలో ‘ఓటు దొంగలారా.. గద్దె దిగండి’ పేరిట ప్రదర్శనలు, సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు.

అయితే ‘ఓటు చోరీ’ పై కాంగ్రెస్‌ వైఖరి ‘దొంగే.. దొంగా అని అరచినట్లుగా’ ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌(రాయ్‌బరేలీ), ప్రియాంక(వయనాడ్‌), సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (కనౌజ్‌), టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ (డైమండ్‌ హార్బర్‌) నియోజకవర్గాల్లో సైతం ఓటర్ల నమోదులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఎదురుదాడికి దిగింది. అంతేగాక కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భారతీయ పౌరసత్వం పొందకముందే ఆమె ఓటు సాధించారని బీజేపీ నేత అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. బంగ్లాదేశీ, ఇతర చొరబాటుదారులను ఓటుబ్యాంకుగా చేసుకున్నారని.. దానిని కాపాడుకోవడానికే ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌)పై గగ్గోలు పెడుతున్నారని అన్నారు.

ఇటలీలో జన్మించిన సోనియాగాంధీ పేరు 1980లో తొలిసారి ఓటర్ల జాబితాలో నమోదైందని.. కానీ అప్పటికి ఆమె భారతీయురాలు కాదని.. 1983లో ఆమెకు భారతీయ పౌరసత్వం లభించిందని ఠాకూర్‌ తెలిపారు. ‘ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు రావడంతో 1982లో ఆమె పేరు తొలగించారు. తిరిగి 1983లో ఓటర్ల జాబితాలో నమోదుచేశారు. అప్పుడు కూడా తప్పుడు నమోదు జరిగింది. ఆ ఏడాది జనవరి 1లోపు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ఏప్రిల్‌ 30న ఆమెకు భారతీయ పౌరసత్వం లభించింది. ఆమె ఓటు నమోదు అత్యంత ఎన్నికల అక్రమమా కాదా’ అని ప్రశ్నించారు.

Rahul Gandhi – ‘మరణించిన ఆ ఓటర్లతో టీ తాగా’ ఈసీకి థాంక్స్‌ – రాహుల్‌ వ్యంగ్యాస్త్రం

‘నాకు జీవితంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉన్నాయి. కానీ.. ఎప్పుడూ ‘మరణించినవారి’తో కలిసి టీ తాగలేదు. ఇప్పుడు ఈ ప్రత్యేక అనుభవానికి కారణమైన ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ చనిపోయారని ప్రకటించి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఏడుగురు వ్యక్తులతో కలిసి టీ తాగు తూ ముచ్చటించిన వీడియోను రాహుల్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. తాము ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌ నియోజకవర్గానికి చెందినవారమని వారు రాహుల్‌కు తెలిపారు. తమలాంటి ఓటర్లు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65లక్షల పేర్ల ముసాయిదా జాబితాను చూసి అవాక్కయ్యామని, తాము చనిపోయామంటూ పేర్లు తీసేసినట్లు గుర్తించామని తెలిపారు.

Also Read : Sandeepa Virk: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 

Leave A Reply

Your Email Id will not be published!