ISRO: 40 అంతస్తులంత జంబో రాకెట్ నిర్మిస్తున్నాం – ఇస్రో ఛైర్మన్
40 అంతస్తులంత జంబో రాకెట్ నిర్మిస్తున్నాం - ఇస్రో ఛైర్మన్
ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) కీలక ముందడుగు వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 40 అంతస్తుల భవనమంత భారీ రాకెట్ నిర్మించే పనిలో నిమగ్నమైనట్లు ఆ సంస్థ ఛైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం, ఎన్1 రాకెట్ ప్రయోగం, అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యునికేషన్ శాటిలైట్ను కక్ష్యలోకి చేర్చడం వంటి ప్రాజెక్టులు చేపట్టనుందన్నారు.
ISRO Chairman Key Updates
‘‘మీకు తెలుసా… అబ్దుల్ కలామ్ జీ తయారు చేసిన తొలిరాకెట్ 17 టన్నుల లిఫ్ట్ఆఫ్ బరువుతో… 35 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యకు చేర్చింది. కానీ, నేడు 75,000 కిలోల బరువైన పేలోడ్ను దిగువ భూకక్ష్యకు చేర్చడంపై పనిచేస్తున్నాం. అందుకు అవసరమైన రాకెట్ 40 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ కు కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మూడు లేదా నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందన్నారు. ఇస్రో (ISRO) ప్రస్తుతం టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ శాటిలైట్ (టీడీఎస్), నౌకాదళం కోసం సిద్ధం చేసిన జీశాట్-7ఆర్ ప్రయోగించనుంది. ఇది ఇప్పటికే కక్ష్యలో ఉన్న జీశాట్-7 (రుక్మిణి) స్థానాన్ని భర్తీ చేయనుంది.
ఉస్మానియాలో జరిగిన స్నాతకోత్సవంలో నారాయణన్కు గౌరవ డాక్టరేట్ను అందజేశారు. భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన చేసిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా దీనిని అందుకొన్నారు.
Also Read : Minister Vangalapudi Anitha: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ప్రత్యేక చట్టం – హోం మంత్రి అనిత
