Air India: అహ్మదాబాద్‌ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం ! 242 మంది మృతి !

అహ్మదాబాద్‌ లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం ! 242 మంది మృతి !

Air India : అహ్మదాబాద్‌ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌ కు బయల్దేరిన ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్‌ 787-7 డ్రీమ్‌ లైనర్‌ విమానం… ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లోనే… బీజే మెడికల్‌ కాలేజీ యూజీ హస్టల్‌ భవనంపై కుప్పకూలింది(Plane Crash). ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణీకులు, పది మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు.

అయితే ప్రమాదం జరిగిన కొన్ని సెకన్లలోనే విమానం మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో… అందరూ మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీరికి తోడు బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ లో లంచ్ చేస్తున్న సుమారు 20 మంది మెడికోలు కూడా మృతి చెందినట్లు సమాచారం. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌ కు చెందిన వారు ఉండగా, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు,ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతి చెందినట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్‌ 787-7 డ్రీమ్‌ లైనర్‌ విమానం బయల్దేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే… 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానిక గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది.

Air India – విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి

ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, గుజరాత్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ధ్రువీకరించారు. లండన్‌ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ రూపానీ ప్రయాణానికి బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పేరుతో ఒక టికెట్‌ తొలుత నెట్టింట వైరల్‌గా మారింది. ఆపై ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్‌ జాబితాలోనూ రూపానీ పేరు ఉండడంతో ఆయన సమాచారం గురించి పలువురు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిని పార్టీ ధ్రువీకరించింది. బీజేపీకు చెందిన విజయ్‌ రామ్‌నిక్‌లాల్‌భాయ్‌ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా… చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

విమాన ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌(Ahmedabad) విమాన ప్రమాదం మహా విషాదమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. విజయవాడ నుంచి హుటాహుటిన బయల్దేరి అహ్మదాబాద్‌ వెళ్లిన ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రమాద ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నేను విజయవాడ నుంచి నేరుగా బయల్దేరి వచ్చాను. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. అన్ని కోణాల్లో లోతైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తాం. అధికారులతో సమావేశం అనంతరం మరిన్ని వివరాలు అందిస్తాం. విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ ఉన్నారు. ఈ ప్రమాదానికి బాధ్యులను ఉపేక్షించం’’ అన్నారు.

Also Read : Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!