Air India Insurance: ఎయిర్ ఇండియా విమానంకు ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో తెలుసా ?
ఎయిర్ ఇండియా విమానంకు ఇన్సూరెన్స్ ఎంత వస్తుందో తెలుసా ?
Air India Insurance : అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఖరీదైన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. దీనికి తోడు ఈ ప్రమాదంలో సుమారు 274 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా యాజమన్యం మృతులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున వారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ ఇండియా విమానానికి బీమా సదుపాయం ఉంది కాబట్టి బీమా సంస్థ నుంచి ఈ నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు.
Air India Insurance Updates
విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాదే (Air India) . ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం… విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే.
అహ్మదాబాద్ (Ahmedabad) ప్రమాదంలో ఎయిర్ ఇండియా (Air India) సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఈ ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 274 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.450 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు.
మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్డీఆర్లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. దీనితో దేశంలోనే ఇది అతి పెద్ద భీమా క్లైమ్ గా నిలువబోతోంది.
Also Read : Gali Janardhana Reddy: సుప్రీంలో కేసు తేలేవరకూ ‘గాలి’ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి