Air India Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు
ఎయిరిండియా విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు
Air India Plane Crash : అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మిగిలిన వారు నివాస సముదాయంలోని ప్రజలు మరణించినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ (Ahmedabad) నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు.
విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. ఇందులో తొలుత 24 మంది మృతిచెందినట్లు సమాచారం రాగా… ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. దీనితో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Air India Plane Crash – ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
ఎయిరిండియా విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే, ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని… ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ను అధికారులు గుర్తించారు. స్థానిక బీజే వైద్యకళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలను తెలుసుకోనున్నారు.
Also Read : Bhoomi Chauhan: భూమి చౌహాన్ ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ జాం