Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత ?

బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత ?

Jubilee Hills : త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అన్ని పార్టీలూ సవాల్‌గా తీసుకోవడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్‌ డివిజన్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, పలువురు ముఖ్య నాయకులతో పాటు మాగంటి గోపీనాథ్‌ (Maganti Gopinath) భార్య సునీత (Maganti Sunitha) కూడా పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్‌ మరణంతో జూబ్లీహిల్స్‌ స్థానం ఖాళీ అయినందునే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే.

Jubilee Hills BRS MLA Candidate

గోపీనాథ్‌ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎవరికే ఆపద వచ్చినా అండగా ఉండేవారని, ఆయన మరణంతో అనుకోకుండా వచి్చన ఈ ఎన్నికలో మాగంటి కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని కేటీఆర్‌ పిలువపునివ్వడంతో పాటు, తనకు అండగా నిలవాలని సునీత కూడా కోరడంతో ఇక ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీనాథ్‌ (Maganti Gopinath) మరణం వల్ల సానుభూతి పవనాలు బీఆర్‌ఎస్‌కు ఉపకరించగలవా అనే చర్చలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నుంచి శ్రీగణేశ్‌ గెలవడంతో, బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును కోల్పోయింది. ఇప్పుడు గోపీనాథ్‌ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికలో ఘన విజయంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని, తిరిగి జైత్రయాత్ర ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలు, హైడ్రా కూల్చివేతలవంటివి అస్త్రాలుగా మలచుకోవాలని భావిస్తోంది.

ఇక ఈ ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌కు రెఫరెండంగా పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇతర ప్రతిపక్ష పారీ్టలు సైతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా రాబోయే రోజుల్లో గెలిచేది తామేనని చెప్పేందుకు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ఈ ఎన్నికలో గెలుపు ద్వారా తమ పాలన కు ప్రజల రెఫరెండం అని బలంగా చెప్పవచ్చని భా విస్తూ ఇప్పటికే కొన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీఅధ్యక్షుడు మహేశ్‌గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిమీనాక్షి నటరాజన్‌ వంటి నేతలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌లకు నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించి, బూత్‌ స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, పేదలకు సన్నబియ్యం సహా ఇతర హామీల అమలు వంటి అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.

ఈ ఎన్నికలో గెలవడం ద్వారా పజ్రలు తమవైపు మొగ్గుచూపుతున్నారని చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని బీజేపీ చెప్పాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దాకా నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కార్పొరేటర్లతోనూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఎన్నిక కోసం మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి బూత్‌స్థాయిలో సమన్వయం చేస్తోంది.

సిట్టింగ్‌ సీటు కావడంతో బీఆర్‌ఎస్‌ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేస్తోంది. గోపీనాథ్‌ మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ఉపకరిస్తుందనే మాగంటి సునీత తమ అభ్యర్థి అనే సంకేతాలిచ్చింది. మాగంటి గోపీనాథ్‌ వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన నేపథ్యం ఉంది. మాగంటి గోపీనాథ్‌ సంస్మరణ సభల ద్వారా పార్టీ ఐక్యతను చాటుతోంది. సునీత ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించి, తన భర్త చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలతో మమేకమవుతోంది. తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ స్వయంగా పాల్గొనడం, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశంతో కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్న వారిని గుర్తించి తమవైపు తిప్పుకోవాలనే యోచనలో ఉంది. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉండటంతో, మజ్లిస్‌ మద్దతు పెను ప్రభావం చూపనుంది. మజ్లిస్‌ పోటీ చేస్తుందా, కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తుందా చూడాల్సి ఉంది.

నేను జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేయడం లేదు – దానం నాగేందర్‌

జూబ్లీహిల్స్‌  (Jubilee Hills)ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం చాలా ముఖ్యమని దానం నాగేందర్‌ అన్నారు. అక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. టికెట్‌ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపుకోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Also Read : Defecting MLAs: యూటర్న్‌ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Leave A Reply

Your Email Id will not be published!