Amit Shah: బిహార్‌ లో ఎన్నికల నగారా మోగించిన అమిత్ షా

బిహార్‌ లో ఎన్నికల నగారా మోగించిన అమిత్ షా

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించారు. ఈ ఏడాది చివర్లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ప్రతిపక్ష ఆర్జేడీకి గట్టి పట్టున్న గోపాల్‌గంజ్‌ లో ఆదివారం ఏర్పాటుచేసిన సభలో అమిత్‌ షా(Amit Shah) ఎన్నికల శంఖారావం పూరించారు. గోపాల్‌ గంజ్‌ సభకు ముందు పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌తో కలిసి అమిత్‌ షా వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రూ.8,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం అమిత్‌ షా పాల్గొంటున్న మొదటిసారి సభ ఇదే కావడం గమనార్హం.

Amit Shah Start’s

ఈ సందర్భంగా గోపాల్ గంజ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోం మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ… బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలు తమ ఓటుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికల్లో మీరందరూ కమలం మీట నొక్కుతారని నాకు తెలుసు’’ అన్నారు. ఆర్‌జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్, ఆయన భార్య రబ్డీదేవి అధికారం చెలాయించిన 15 దశాబ్దాల కాలంలో బిహార్‌(Bihar) లో జంగిల్‌ రాజ్‌ నడిచిందని, కిడ్నాప్‌ లు, హత్యలు, దోపిడీలు ఒక పరిశ్రమగా మారాయని నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రంలో రక్షణ కొరవడటంతో ముఖ్యమైన వ్యాపారవేత్తలంతా ఆ సమయంలో రాష్ట్రాన్ని వీడారు. దాణా కుంభకోణానికి పాల్పడిన లాలు ప్రసాద్‌ యాదవ్‌ పేరు ప్రపంచ దేశాల్లోనే మారుమోగింది, బిహార్‌కు ఆయన తీరని కళంకం తెచ్చారు’అని అమిత్‌ షా ఆరోపించారు.

‘కుటుంబ రాజకీయాలు చేసే లాలు… భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కుమార్తెను పార్లమెంట్‌కు పంపారు. ఇప్పుడు ఆయన ఇద్దరు కుమారులు సీఎం అవ్వాలనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. ‘అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా చెప్పుకునే లాలు… దాణా కూడా బొక్కేశారు. అటువంటి వ్యక్తి రికార్డు స్థాయిలో స్కాములే తప్ప, పేదలకు చేసేదేమీ లేదు’అని మండిపడ్డారు. సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వరదల సమస్యకు చెక్‌ పెట్టామని చెప్పారు. లాలు–రబ్డీల జంగిల్‌ రాజ్‌ కావాలో, మోదీ, నితీశ్‌ల అభివృద్ధి కావాలో తేల్చుకునే సమయం ఇప్పుడు వచ్చిందని షా అన్నారు.

బీజేపీతో విడిపోయే ప్రసక్తే లేదు – బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌

గతంలో బీజేపీతో రెండుసార్లు విడిపోవడానికి తన సొంత పార్టీలో కొంత మంది వ్యక్తులు కారణమని, మళ్లీ ఆ పార్టీతో విడిపోయే ప్రసక్తే లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు పట్నాలో జేడీ(యు), బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము సాధించే విజయం చాలా గొప్పగా ఉండబోతోందని తెలిపారు. అనంతరం సీఎం నీతీశ్‌ మాట్లాడుతూ… ‘తాము అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో విద్యా, ఆరోగ్య సంరక్షణ సరిగా లేదు. జేడీ(యు), బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని మెరుగవుతున్నాయన్నారు.

Also Read : PM Narendra Modi: ఆరెస్సెస్‌ దేశ సంస్కృతి వటవృక్షం – ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!