Amit Shah: ఆర్టికల్ 370 రద్దుతోనే కశ్మీర్ లో శాంతి – హోం మంత్రి అమిత్ షా
ఆర్టికల్ 370 రద్దుతోనే కశ్మీర్ లో శాంతి - హోం మంత్రి అమిత్ షా
Amit Shah : యూపిఏ హయాంలో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులను కీర్తించడంతో పాటు ఉగ్రవాదుల శవాలతో అంత్యక్రియలు జరిగేవని… కాని ప్రస్తుతం ఉగ్రవాదులను హతమార్చిన చోటే పూడ్చిపెడుతున్నామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం విషయంలో యువత ప్రమేయం దాదాపు కనుమరుగైందని అమిత్ షా(Amit Shah) స్పష్టం చేసారు.
Amit Shah Comment
2004 నుంచి 2014 మధ్య 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగితే… 2014 నుంచి 2024 మధ్య 2,242 ఘటనలు జరిగాయన్నారు. ఉగ్రవాదం కారణంగా జరిగే మరణాల సంఖ్య 70 శాతం తగ్గిందన్నారు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించడం లేదని యూరీ, పుల్వామా ఘటనల తర్వాత పది రోజుల వ్యవధిలోనే సర్జికల్, ఎయిర్ స్ట్రైక్స్ జరిపి గట్టిగా బదులిచ్చామన్నారు. అంతేకాదు 2024లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హోం శాఖ పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ… కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని… తెలిపారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారన్న అమిత్ షా… గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగడం లేదన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కశ్మీర్లో సినిమా ధియేటర్లు కూడా నిండుతున్నాయని అమిత్ షా అన్నారు.
‘‘మా ప్రభుత్వ హయాంలో నక్సలిజాన్ని దాదాపుగా రూపుమాపాం. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా అణిచివేశాం కశ్మీర్లో రాళ్లురువ్వే సంఘటనలు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే మా హయాంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. వేర్పాటు వాదానికి ఆర్టికల్ 370 మూల కారణం. పిఎఫ్ఐ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించాం. బింద్రే సానుభూతిపరులను జైలు ఊచలు లెక్కబెట్టించాము’’ అని రాజ్యసభలో అమిత్ షా వివరించారు.
Also Read : YS Sunitha: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సునీత మరో పిటిషన్