Amit Shah: బీఎస్ఎఫ్ దెబ్బకు పాక్ నిఘా వ్యవస్థ తుత్తునియలు – అమిత్ షా
బీఎస్ఎఫ్ దెబ్బకు పాక్ నిఘా వ్యవస్థ తుత్తునియలు - అమిత్ షా
Amit Shah : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యలను దీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాల (బీఎస్ఎఫ్)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) శుక్రవారం ప్రశంసలు కురిపించారు. బీఎస్ఎఫ్ బలగాలు పాకిస్తాన్ కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులతోపాటు సమాచార, నిఘా వ్యవస్థను తుత్తునియలు చేశాయని తెలిపారు. తీవ్రంగా నష్ట పోయిన శత్రుదేశం తిరిగి కోలుకునేందుకు నాలుగైదు ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల ఉద్రిక్తతల సమయంలో పౌర ఆవాసాలతోపాటు, మన సరిహద్దులపైకి దాడులకు పాల్పడిన పాక్కు గట్టిగా బుద్ధి చెప్పిన బీఎస్ఎఫ్ బలగాలను ఆయన ప్రశంసించారు. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న సమయంలో సైతం ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తూ, ముందుగానే కచ్చితమైన సమాచారంతో విజయవంతంగా దాడులను పూర్తి చేయగలమని బీఎస్ఎఫ్ రుజువు చేసిందన్నారు. ఎడారులు, పర్వతప్రాంతాలు, అడవులు, కఠినమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అచంచలమైన అంకిత భావంతో పనిచేస్తూ దేశానికి మొదటి రక్షణ శ్రేణిగా సేవలందిస్తోందన్నారు.
Amit Shah Key Comments
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతరం జమ్మూకశ్మీర్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఇటీవల జరిపిన దాడులతో నష్టపోయిన పుంఛ్లోని బాధిత కుటుంబాలను హోంమంత్రి పరామర్శించారు. దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న పుంఛ్లోని ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా మందిరాలకు కేంద్రం త్వరలో పరిహార ప్యాకేజీని ప్రకటిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఆయన అమర్నాథ్ యాత్రకు చేపట్టిన ఏర్పాట్లు, జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష జరిపారు. ఇటీవల పాక్ కాల్పులతో పూంఛ్ జిల్లాలో నష్టపోయిన సరిహద్దు ప్రాంతాల వాసులతో మాట్లాడారు. జవాన్లతో స్వయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ… ‘‘ఇది తీవ్రంగా ఖండించదగిన చర్య. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకొని పాకిస్థాన్ ఈ రెచ్చగొట్టే దాడులకు తెగబడింది. ఆ తర్వాత మన దళాలు దీటుగా స్పందించాయి’’ అన్నారు. ఈ పరిణామాలు జమ్మూకశ్మీర్ ప్రగతిపై ఎటువంటి ప్రభావం చూపబోవని, ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందన్నారు. భారత్కు హాని కలిగించాలని చూసే ఎవరికైనా మరింత బలంగా తగిన సమాధానం ఇస్తామని తెలిపారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక సరిహద్దు వెంబడి ఇప్పటిదాకా 9,500కు పైగా బంకర్లు నిర్మించామని, పాక్తో ఘర్షణల సమయంలో మూడు రోజులపాటు స్థానికులకు రక్షణ కల్పించడంలో ఇవి కీలకపాత్ర పోషించాయన్నారు.
భారత్ తలచుకుంటే పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది – రాజ్నాథ్
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం రంగంలోకి దిగి ఉంటే పాకిస్థాన్ నాలుగు ముక్కలయ్యేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశీయంగా తయారు చేసిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘‘1971లో భారత నౌకాదళం రంగంలోకి దిగితే పాకిస్థాన్ రెండు కింద విడిపోయింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో రంగంలోకి దిగి ఉంటే రెండు కాదు… పాకిస్థాన్ నాలుగు ముక్కలయ్యేది’’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్లను భారత్కు పాకిస్థాన్ అప్పగించాలని రాజ్నాథ్ పేర్కొన్నారు. చర్చలపై నిజంగా పాకిస్థాన్కు ఆసక్తి ఉంటే తక్షణమే ఈ పనిచేయాలని అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు. విరామమిచ్చాం. పాకిస్థాన్ మళ్లీ తప్పు చేస్తే ఇంకా తీవ్రంగా స్పందిస్తాం. ఈసారి కోలుకోవడానికి కూడా అవకాశం ఉండదు’’ అని రక్షణ మంత్రి తెలిపారు.
Also Read : Himalayas: గ్లోబల్ వార్మింగ్ తో హిమాలయాలకు ముంచుకొస్తున్న ముప్పు