AP Cabinet: యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
AP Cabinet : రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఏపీ మంత్రివర్గం (AP Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
AP Cabinet Approved
ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం (AP Cabinet) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారు. రూ.2.5 లక్షలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. 1.43 కోట్ల పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకూ వర్తించేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు.
కొత్తగా 10 వైద్య కళాశాలలకు ఆమోదం
మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీ చేసేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
Also Read : Dussehra: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి దసరా ఉత్సవాలు
