ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చన్న పవన్ కళ్యాణ్
భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కు కల్పించింది
అమరావతి : ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కు ఉందని, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్ లోని మాండ్లా పార్లమెంటు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై డిప్యూటీ సీఎం కు ఫిర్యాదు చేశారు చైర్మన్. ఈ సందర్బంగా ఆయనకు చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం అని అన్నారు. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పార. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మర్యాద పూర్వక భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే పవన్ దృష్టికి తీసుకు వచ్చారు.
